తాడ్వాయి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా స్నేహితుల దినోత్సవం

కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్న జర్నలిస్టులు

తాడ్వాయి, ఆంధ్రప్రభ : తాడ్వాయి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యులు కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకుంటూ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కృష్ణ చైతన్య గౌడ్ మాట్లాడుతూ వృత్తిపరంగా తాము జర్నలిస్టులైనా తమ మధ్య బలమైన స్నేహబంధం ఉందని అన్నారు. కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు అండగా నిలుస్తూ, ఆపద సమయంలో పరస్పరం సహకరించుకుంటామని తెలిపారు.

ప్రపంచంలో స్నేహ బంధానికి మించిన బంధం మరొకటి లేదని, అన్ని బంధాల కంటే స్నేహబంధమే గొప్పదని అన్నారు. ఎలాంటి రక్తసంబంధం లేకపోయినా ఎల్లప్పుడూ మనకు అండగా నిలిచేది నిజమైన స్నేహితుడేనని పేర్కొన్నారు.

శ్రీకృష్ణుడు–కుచేలుడి స్నేహం నుంచి నేటి ఆధునిక యుగం వరకు స్నేహబంధం విలువ ఏమాత్రం తగ్గలేదని అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రాణస్నేహితుడు ఉంటాడని, కుటుంబ సభ్యులతో పంచుకోలేని విషయాలను కూడా స్నేహితుడితో పంచుకునే అనుబంధం ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు మల్లేష్, సునీల్ కుమార్, కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి, ఖజాంచి సంగెపు మురళి, సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌కుమార్, నవీన్ యాదవ్, నరేష్, సాయిబాబా, అఖిల్, రాజలింగం, రాజు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.