Chhattisgarh pension issue | పెన్షన్ కోసం మండుటెండలో మైళ్ల దూరం ప్రయాణం

Chhattisgarh pension issue | పెన్షన్ కోసం మండుటెండలో మైళ్ల దూరం ప్రయాణం
Chhattisgarh pension issue | 90 ఏళ్ల అత్తను వీపుపై మోసిన కోడలు
కేవైసీ కారణంగా నిలిచిపోయిన పెన్షన్
వైరల్ అయిన హృదయవిదారక వీడియో
వ్యవస్థ వైఫల్యంపై వెల్లువెత్తిన విమర్శలు
Chhattisgarh pension issue | కునియా: ఛత్తీస్గఢ్లోని సుర్గుజా జిల్లాలో చోటు చేసుకున్న ఓ ఘటన హృదయాలను కలచివేస్తోంది. కేవలం 500 రూపాయల నెలవారీ వృద్ధాప్య పెన్షన్ కోసం ఓ మధ్యవయస్కురాలు తన 90 ఏళ్ల అత్తను వీపుపై మోసుకుంటూ, మండే ఎండలో కాళ్లకు చెప్పులు సైతం లేకుండా మైళ్ల దూరం నడిచి బ్యాంకుకు తీసుకెళ్లిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
రాష్ట్రంలోని కునియా ప్రాంతం జంగల్వరా గ్రామానికి చెందిన సుఖ్మనియా అనే మహిళ, గత నాలుగు నెలలుగా తన అత్తకు పెన్షన్ రాకపోవడంతో ఆందోళన చెందింది. సాధారణంగా బ్యాంక్ మిత్ర ఇంటికే వచ్చి పెన్షన్ అందజేసేవారు. కానీ కేవైసీ పూర్తి కాలేదని చెప్పి పెన్షన్ నిలిపివేయడంతో వృద్ధులను బ్యాంకుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అత్త ఆరోగ్యం సరిగా లేకపోవడంతో సుఖ్మనియా ఆమెను వీపుపై మోసుకుని మైన్పాట్ పట్టణంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖకు కాలినడకన బయలుదేరింది. ఒకవైపు మండుతున్న ఎండ, కింద కాలుతున్న రహదారి, అలసట.. ఏదీ ఆమెను ఆపలేకపోయాయి.
అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఈ దృశ్యాలను వీడియోగా చిత్రీకరించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై స్పందించిన స్థానిక అధికారులు, కేవైసీ ప్రక్రియ పూర్తి కాకపోవడం వల్లే పెన్షన్ నిలిచిపోయిందని అంగీకరించారు. బ్యాంకులో సర్టిఫికేషన్ పూర్తయిన వెంటనే పెండింగ్లో ఉన్న రూ. 2,000 పెన్షన్ను విడుదల చేశారు. ఇకపై పెన్షన్ను నేరుగా ఇంటి వద్దకే తెచ్చిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
ఈ ఘటనపై ఛత్తీస్గఢ్ మాజీ ఉప ముఖ్యమంత్రి టీఎస్ దేవ్ మాట్లాడుతూ, ఓట్ల కోసం ప్రజల ఇళ్లకు వెళ్లే నాయకులు వృద్ధుల పెన్షన్లను కూడా వారి ఇంటికే చేరేలా చూడాలని అన్నారు. పేదలు తమకు రావలసిన చిన్న మొత్తాన్ని పొందడానికి కూడా ఇంత కష్టపడాల్సి రావడం వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
