Rs.300 | నాన్వెజ్ ప్రియులకు షాక్

Rs.300 | నాన్వెజ్ ప్రియులకు షాక్
చికెన్.. ట్రిపుల్ సెంచరీ
అమాంతం పెరిగిన ధరలు
కిలో చికెన్ ధర ₹160-₹200 నుంచి ₹300 దాటింది.
రంజాన్ మాసం డిమాండ్,
పౌల్ట్రీ ఫారమ్లలో తగ్గిన ఉత్పత్తి
₹380 కి చేరుకునే అవకాశం ఉందని నివేదికలు
ఆందోళనలో చికెన్ ప్రియులు
ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : సండే వచ్చిందంటే చాలు… చికెనో.. మటనో.. చేపల కూరో ఉండాల్సిందే. మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా చికెన్ కొనుగోలుకు ఆసక్తి చూపుతాయి. ఎందుకంటే వాటి ధర సామాన్యులకు అందుబాటులో ఉంటుంది కాబట్టి. కానీ ప్రస్తుతం చికెన్ ధరలు కూడా కొండెక్కి కూర్చున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు అమాంతం పెరిగి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ముక్కలేనిదే ముద్ద దిగని నాన్వెజ్ ప్రియులకు పెరిగిన ధరలు షాక్ ఇస్తున్నాయి.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో బహిరంగ మార్కెట్లో కేజీ చికెన్ ధర 320 రూపాయలకు చేరింది. చికెన్ ధర 300 రూపాయల మార్కును దాటడంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. సండే వస్తే చికెన్ షాపులకు పరుగెత్తే మధ్యతరగతి కుటుంబీకులు పెరిగిన ధరలతో అటు వైపు వెళ్లడానికి జంకుతున్నారు.

ఓ పక్క కోడిగుడ్ల ధరలు తగ్గుతుంటే.. మరోపక్క చికెన్ ధరలు పెరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇరాన్ ఇజ్రాయిల్ అమెరికా యుద్ధ కారణంగా ఎగుమతులు లేక కోడిగుడ్ల ధరలు తగ్గాయి. కానీ ఇదే స్థాయిలో చికెన్ ధరలు పెరిగాయి. అలాగే పౌల్ట్రీ పరిశ్రమలో ఉత్పత్తి తగ్గడం, పౌల్ట్రీ ఫారాల నుంచి సరఫరా కూడా తగ్గింది. ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో హర్రీస్ తయారు చేయడానికి కోళ్లను గణనీయంగా ఉపయోగించే క్రమంలో అవసరానికి తగ్గట్టుగా చికెన్ ఉత్పత్తి జరగడం లేదనే అభిప్రాయం ఉంది. కోళ్లఫారాల నిర్వాహకులు కోళ్లదాణా ఖర్చులు పెరగడం, రవాణాఖర్చులు పెరగడం వంటి అనేక కారణాలతో ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వంటింట్లో చికెన్ ఉడకడం కష్టమే అని సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసవి నేపథ్యంలో రాబోయే కొన్ని నెలల్లో కిలో చికెన్ ధర 380 రూపాయల వరకు చేరే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

