గుండ్రంపల్లి వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..
చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామ శివారులో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి (ఎన్హెచ్-65) పక్కన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు చిట్యాల పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే ఆదివారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయస్సు సుమారు 55 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండవచ్చని, మతిస్థిమితం సరిగా లేక బిక్షాటన చేస్తూ జీవించే వ్యక్తిగా భావిస్తున్నట్లు చిట్యాల ఎస్ఐ మామిడి రవికుమార్ తెలిపారు.
మృతుడి ఒంటిపై గోధుమ (బ్రౌన్) రంగు అంగీ మాత్రమే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని, ఆయనను ఎవరైనా గుర్తిస్తే వెంటనే చిట్యాల పోలీస్స్టేషన్కు సమాచారం అందించాలని ఎస్ఐ కోరారు.
