TG | తెలంగాణలో 9మందికి ఉత్తర్వులు జారీ

TG | తెలంగాణలో 9మందికి ఉత్తర్వులు జారీ
TG | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : తెలంగాణ పోలీస్ శాఖలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అదనపు ఎస్పీ (ఏఎస్పీ) స్థాయిలో పనిచేస్తున్న తొమ్మిది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం రాత్రి అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఈ బదిలీలకు సంబంధించిన ఆదేశాలను వెలువరించారు. పరిపాలనా సౌలభ్యంతో పాటు, జిల్లాల్లో శాంతిభద్రతల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
ట్రాన్స్ఫర్ అయినవారి వివరాలు..
కామారెడ్డి ఏఎస్పీగా ఉన్న బొక్కా చైతన్యరెడ్డిని సంగారెడ్డి అదనపు ఎస్పీగా, జనగామ ఏఎస్పీ పందిరి చేతన్ నితిన్ను జగిత్యాల ఏఎస్పీగా నియమించారు. భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్కుమార్ సింగ్ను మెదక్ ఏఎస్పీగా, వరంగల్ ఏఎస్పీ నగ్రాలె శుభమ్ ప్రకాశ్ను నిజామాబాద్ అదనపు డీసీపీగా బదిలీ చేశారు. భైంసా అదనపు ఎస్పీ రాజేశ్ మీనాను వనపర్తి ఏఎస్పీగా నియమించారు. ఇక, ఆసిఫాబాద్ ఏఎస్పీ ఎస్. చిత్తరంజన్, ఆదిలాబాద్ ఏఎస్పీ పి. మౌనికలను అదే జిల్లాల్లో అదనపు ఎస్పీ (అడ్మిన్) పోస్టుల్లో నియమించారు. నిర్మల్ ఏఎస్పీ పత్తిపాక సాయికిరణ్ భైంసా ఏఎస్పీ (ఎస్డీపీఓ)గా, వేములవాడ ఏఎస్పీ రుత్విక్సాయి ఉట్నూర్ ఏఎస్పీ (ఎస్డీపీఓ)గా బదిలీ అయ్యారు. బదిలీ అయిన అధికారులు వెంటనే కొత్త బాధ్యతలు స్వీకరించాలని ప్రభుత్వం ఆదేశించింది.
