స్వర్ణ ప్రాజెక్టు నుంచి సాగునీటి విడుదల

నిర్మల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ: బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రత్యేక చొరవతో మంగళవారం స్వర్ణ ప్రాజెక్టు నుంచి దిగువ ప్రాంతాల పంట పొలాలకు సాగునీటిని విడుదల చేశారు. జౌళి నాలా ద్వారా 80 క్యూసెక్కులు, లెఫ్ట్ కెనాల్ ద్వారా 20 క్యూసెక్కులు కలిపి మొత్తం 100 క్యూసెక్కుల నీటిని రైతుల సాగు అవసరాల కోసం విడుదల చేసినట్లు తెలిపారు.

వ్యవసాయానికి సాగునీరు ఎంతో కీలకమని, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టు కెనాల్ల ద్వారా నీటిని విడుదల చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. దీంతో దిగువ ప్రాంతాల్లోని వేల ఎకరాల పంటలకు సాగునీటి లభ్యత మెరుగుపడుతుందని తెలిపారు. అనంతరం స్వర్ణ ప్రాజెక్టు గేట్ల లీకేజీలను పరిశీలించిన ఎమ్మెల్యే, అవసరమైన మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నీటి వృథాను అరికట్టి, సాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా ప్రాజెక్టు నిర్వహణ చేపట్టాలని సూచించారు. రైతుల అవసరాలను బట్టి రానున్న రోజుల్లో నీటి విడుదలను పెంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, రైతులు, పరిసర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.