tirumala| లడ్డూల విక్రయంలో రికార్డు
లడ్డూల విక్రయంలో రికార్డు
మే నెలలో 1.21 కోట్ల శ్రీవారి లడ్డూల అమ్మకాలు
రోజుకు సగటున 4.08 లక్షల లడ్డూల తయారీ
నాణ్యతపై టీటీడీ ప్రత్యేక దృష్టి
తిరుమల, ఆంధ్రప్రభ: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానంతరం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ఈ ఏడాది మే నెలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ఉత్పత్తిని విస్తృతంగా పెంచి, ఎలాంటి కొరత లేకుండా ప్రసాదాలను భక్తులకు అందిస్తోంది.
ఈ ఏడాది మే నెలలో మొత్తం 1,21,35,528 లడ్డూలు విక్రయమయ్యాయి. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది లడ్డూల విక్రయాలు గణనీయంగా పెరగడం విశేషం. 2024 మే నెలలో 1.01 కోట్ల లడ్డూలు విక్రయమవ్వగా, 2025లో 1.10 కోట్లకు పెరిగాయి. 2026 మే నెలలో 1.21 కోట్లకు పైగా లడ్డూల విక్రయాలు నమోదయ్యాయి.
రోజుకు 4 లక్షలకుపైగా లడ్డూల తయారీ
శ్రీవారి ప్రసాదాల తయారీలో నాణ్యతకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తున్న టీటీడీ, రోజుకు సగటున 4.08 లక్షల లడ్డూలను తయారు చేస్తోంది. సాధారణ రోజుల్లో 4 లక్షల నుంచి 4.5 లక్షల వరకు లడ్డూలు తయారవుతుండగా, ప్రత్యేక సందర్భాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తిని మరింత పెంచుతోంది.
లడ్డూ తయారీకి రోజూ 68 టన్నుల ముడి పదార్థాలు
అత్యంత పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ కోసం ప్రతిరోజూ 68 టన్నులకు పైగా ముడి పదార్థాలను టీటీడీ వినియోగిస్తోంది. రోజుకు సుమారు 32 టన్నుల చక్కెర, 16 టన్నుల శెనగపిండి, 16 టన్నుల నెయ్యి, 3.5 టన్నుల జీడిపప్పు, 2 టన్నుల ఎండుద్రాక్ష, 400 కిలోల యాలకులు, 800 కిలోల కలకండ వినియోగిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఒక్క చిన్న లడ్డూ తయారీకి సగటున 167 నుంచి 170 గ్రాముల ముడి పదార్థాలు ఉపయోగిస్తున్నారు. ఇందులో సుమారు 78 గ్రాముల చక్కెర, 39 గ్రాముల శెనగపిండి, 36 గ్రాముల నెయ్యి, 7 గ్రాముల జీడిపప్పు, 3 గ్రాముల ఎండుద్రాక్షతో పాటు ఇతర పదార్థాలు ఉంటాయి.
జీఐ గుర్తింపు.. ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తిరుపతి లడ్డూకు భారత ప్రభుత్వం జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపును మంజూరు చేసింది. అలాగే లడ్డూ తయారీ, విక్రయాలకు సంబంధించి ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ కూడా టీటీడీకి లభించింది. దీంతో శ్రీవారి లడ్డూ నాణ్యత, ప్రామాణికత మరింత బలోపేతమైంది.
ఏఐ ఆధారిత కలర్ సార్టింగ్ యంత్రాలతో నాణ్యత నియంత్రణ
ప్రసాదాల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల్లో ఎలాంటి మలినాలు లేకుండా చూసేందుకు శ్రీవారి పోటులో రెండు అత్యాధునిక ఏఐ ఆధారిత కలర్ సార్టింగ్ యంత్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ముడి పదార్థాల్లోని మలినాలను తొలగించి, అత్యుత్తమ నాణ్యత గల ముడి సరుకులను మాత్రమే వినియోగిస్తున్నారు. పోటు విభాగానికి అవసరమైన అన్ని ముడి సరుకులను కొనుగోలు విభాగం సేకరిస్తోంది. ఆ తర్వాత ప్రయోగశాల పరీక్షలు నిర్వహించి, నాణ్యత నిర్ధారించిన అనంతరమే వాటిని వినియోగానికి అనుమతిస్తున్నారు.
సంప్రదాయ దిట్టం ప్రకారమే తయారీ
శ్రీవారి ప్రసాదాల తయారీలో 1950, 1951 సంవత్సరాల్లో టీటీడీ ఆమోదించిన సంప్రదాయ దిట్టం ప్రమాణాలను నేటికీ ఖచ్చితంగా పాటిస్తున్నారు. నిత్య, వార, పక్ష, మాస, నక్షత్ర, సాలకట్ల ఉత్సవాలకు అనుగుణంగా సుమారు 20 రకాల అన్నప్రసాదాలు, 25 రకాల పణ్యారాలను సిద్ధం చేస్తున్నారు.
24 గంటలూ నిరంతరాయంగా సేవలు
శ్రీవారి పోటులో రెండు షిఫ్టుల్లో సుమారు 700 మంది శ్రీవైష్ణవ బ్రాహ్మణులు భక్తి శ్రద్ధలతో 24 గంటలూ సేవలందిస్తూ లడ్డూ ప్రసాదాల తయారీలో పాల్గొంటున్నారు. వీరికి టీటీడీ సిబ్బంది, పర్యవేక్షకులు సహకరిస్తున్నారు.
భారీ మౌలిక సదుపాయాలు
లడ్డూ తయారీ ప్రక్రియలో భాగంగా బూంది పోటు, పడి పోటు, అదనపు పోటు, అంతర్గత పోటు వంటి ప్రత్యేక విభాగాలు పనిచేస్తున్నాయి. రోజుకు 15 టన్నుల శెనగపప్పును పిండిగా మార్చే ఫ్లోర్ మిల్, 2.10 లక్షల కిలోల సామర్థ్యం గల నెయ్యి నిల్వ ట్యాంకులు, 30 టన్నుల సామర్థ్యం గల గ్యాస్ ప్లాంట్, రెండు నుంచి ఏడు రోజుల వరకు ముడి సరుకులు నిల్వ ఉంచగల ఉగ్రాణం అందుబాటులో ఉన్నాయి. అలాగే కన్వేయర్ బెల్ట్ వ్యవస్థ ద్వారా బూంది తరలింపు వంటి ఆధునిక సదుపాయాలను కూడా టీటీడీ ఏర్పాటు చేసింది.
56 కౌంటర్లలో లడ్డూల పంపిణీ
భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని లడ్డూ కాంప్లెక్స్లో 56 కౌంటర్ల ద్వారా మూడు షిఫ్టుల్లో 24 గంటలూ లడ్డూల విక్రయం, పంపిణీ జరుగుతోంది. అదనపు లడ్డూల కొనుగోలు కోసం డిజిటల్ చెల్లింపులతో పనిచేసే కియోస్క్ యంత్రాలను కూడా ఏర్పాటు చేశారు. దర్శనం పొందిన ప్రతి భక్తునికి ఒక లడ్డూను ఉచితంగా అందజేస్తున్నారు.
రద్దీ రోజులకు భారీ బఫర్ స్టాక్
భక్తుల రద్దీ అధికంగా ఉండే రోజుల్లో ఎలాంటి కొరత రాకుండా 8 లక్షల నుంచి 10 లక్షల లడ్డూల వరకు బఫర్ స్టాక్ సిద్ధంగా ఉంచుతున్నారు. ఇటీవలి కాలంలో శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత, రుచి మరింత మెరుగుపడటంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
