ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే ఆలోచన లేదు..

ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే ఆలోచన లేదు..
- సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దు
- ఆర్టీసీ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుంది
- త్వరలో రాష్ట్రానికి 750 ఎలక్ట్రికల్ బస్సులు
- ప్రెస్ మీట్ లో ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు
మచిలీపట్నం, ఆంధ్రప్రభ ; ఏపీఎస్ ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయమని ఆ సంస్థ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు స్పష్టం చేశారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తామని తాను చెప్పినట్టు వివిధ మాధ్యమాలలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
శనివారం ఉదయం తాను మచిలీపట్నం ఆర్టీసీ బస్టాండ్ ను సందర్శించినప్పుడు కొంత మంది మీడియా ప్రతినిథులు ఆర్టీసీలో కొత్తగా కొనుగోలు చేసే ఎలక్ట్రికల్ బస్సులను ప్రైవేట్ వ్యక్తులకు టెండర్లు ఇవ్వడంపై వివరణ ఇవ్వగా ఆ సందర్భంలో తాను మాట్లాడిన మాటలను కొంత మంది వక్రీకరించి పలు మాధ్యమాలలో ప్రచారం చేశారు.
ఆర్టీసీ మొత్తాన్ని ప్రైవేటీకరణ చేస్తామని తాను చెప్పినట్టుగా కార్మిక వర్గంలోకి తీసుకువెళ్లారన్నారు. ఈ ప్రచారాన్ని నమ్మవద్దని కార్మికులను కోరారు. ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న ఆర్టీసీని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది తప్పితే ప్రైవేటీకరణ చేసే ఆలోచన ఏ మాత్రం తమకు లేదన్నారు.
ఎలక్టికల్ బస్సుల కొనుగోలు అంశం కేంద్ర ప్రభుత్వ పరిథిలోనిదన్నారు. దేశవ్యాప్తంగా ఎలక్ట్రికల్ బస్సులను కొనుగోలు చేయాలని హౌసింగ్ & అర్బన్ డిపార్ట్మెంట్ టెండర్లు పిలిచిందన్నారు. అందులో భాగంగా మన రాష్ట్రానికి 750 ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలుకు టెండర్లు ఖరారైనట్టు తెలిపారు.
అయితే ఈ బస్సుల నిర్వహణ, డ్రైవర్ల నియామకం టెండర్లు దక్కించుకున్న ప్రైవేట్ వ్యక్తులే చూసుకుంటారన్నారు. ఈ బస్సులపై పూర్తి పర్యవేక్షణ, కండెక్టర్ల నియామకం ఆర్టీసీ పరిథిలోనే ఉంటుందన్నారు. అలాగే ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని కొనకళ్ల నారాయణరావు తెలిపారు.
