మహారాష్ట్ర వర్షాల ఎఫెక్ట్.. మేడిగడ్డ బ్యారేజ్‌కు భారీ వరద

మహారాష్ట్ర వర్షాల ఎఫెక్ట్.. మేడిగడ్డ బ్యారేజ్‌కు భారీ వరద

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డలోని లక్ష్మీ బ్యారేజ్‌కు భారీగా వరద నీరు చేరుతోంది. జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ) సూచనల మేరకు లక్ష్మీ బ్యారేజ్‌లోని మొత్తం 85 గేట్లను అధికారులు ఎత్తివేశారు. బ్యారేజ్‌లోకి చేరుతున్న వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ప్రస్తుతం లక్ష్మీ బ్యారేజ్‌లోకి 70,140 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, అదే స్థాయిలో 70,140 క్యూసెక్కుల అవుట్‌ఫ్లోను అధికారులు విడుదల చేస్తున్నారు. దీంతో గోదావరి జలాలు దిగువ ప్రాంతాలకు ప్రవహిస్తున్నాయి. మహారాష్ట్రలో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో గోదావరిలో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యారేజ్ భద్రతను దృష్టిలో ఉంచుకుని పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వరద పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.