Mangalagiri | నిధి సెంటర్లో అగ్నిప్రమాదం …

మంగళగిరి – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక శాఖ కార్యాలయం నిధి భవన్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం ఉదయం అమరావతిలోని నిధి భవన్ లో మంటలు చెలరేగడంతో ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి. దీంతో సుమారు 300 మంది ఉద్యోగులు భయంతో కిందికి పరుగులు తీశారు. సెంట్రల్‌ ఏసీలో షార్ట్‌ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు.

మంటలు ఎగిసిపడడంతో కంప్యూటర్లు కాలిపోయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల జీతభత్యాలు, వివిధ శాఖలకు సంబంధించిన లావాదేవీల బిల్లులు నిధి భవన్ లోనే ఉంటాయి. ఆన్ లైన్ వ్యవస్థే అయినప్పటికీ కంప్యూటర్లు మొత్తం కాలిపోవడంతో సమాచారం కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే, అగ్ని ప్రమాదంతో ఎంత నష్టం జరిగిందనేది ఇప్పటికిప్పుడు అంచనా వేయలేమని అధికారులు చెబుతున్నారు.

ఈ నిధిభవన్లో మొత్తం 10 వరకు ప్రభుత్వ కార్యాలయాలు ఉండగా అందులో అతి ముఖ్యమైన సీఎం ఎఫ్ ఎస్ ఎస్ కార్యాలయం కూడా ఉంది. ప్రస్తుతం సంభవించిన అగ్ని ప్రమాదంతో ప్రభుత్వ ఫైల్స్ కు ఎటువంటి ఇబ్బంది లేదని, పూర్తి సమాచారం అంతా క్లౌడ్ లో నిక్షిప్తమయి ఉన్నట్లుగా ఉద్యోగులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *