కర్నూలు జిల్లాలో జలాశయాల్లో నీటి నిల్వలు మెరుగుదల
- తుంగభద్రకు 58,523 క్యూసెక్కుల వరద ప్రవాహం
- సాగునీటి అవసరాలకు అనుగుణంగా విడుదల
- శ్రీశైలం, వెలిగోడు, గోరకల్లు, పులికనుమ జలాశయాల్లోనూ ఆశాజనక నిల్వలు
కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ: కర్నూలు జిల్లాలోని ప్రధాన జలాశయాలు, ఆనకట్టలు, బ్యారేజీలలో నీటి నిల్వలు క్రమంగా మెరుగుపడు తున్నాయి. రాష్ట్ర జలవనరుల శాఖ ఆగస్టు 5న విడుదల చేసిన కాలువలు, జలాశయాలు, నీటి నిల్వలు, ప్రవాహాలు, విడుదలల వివరాల ప్రకారం తుంగభద్ర జలాశయంతో పాటు గాజులదిన్నె, సుంకేసుల, శ్రీశైలం, వెలిగోడు, గోరకల్లు, ఓవీకే, పులికనుమ తదితర ప్రాజెక్టుల్లో గణనీయమైన నీటి నిల్వలు నమోదయ్యాయి. ఈ పరిస్థితి రానున్న సాగు అవసరాలకు ఊరటనిచ్చేలా ఉందని అధికారులు భావిస్తున్నారు.
తుంగభద్రలో 59.718 టీఎంసీల నీటి నిల్వ..
తుంగభద్ర జలాశయం పూర్తి నిల్వ మట్టం 1,633.00 అడుగులు కాగా ప్రస్తుతం 1,619.42 అడుగుల వద్ద నీటిమట్టం నమోదైంది. మొత్తం 105.788 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి గాను ప్రస్తుతం 59.718 టీఎంసీల నీరు ఉంది. జలాశయానికి 58,523 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండగా 1,443 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. రాయలసీమ ప్రాంతానికి సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని నీటి నిర్వహణ కొనసాగుతోందని నివేదిక పేర్కొంది.
గాజులదిన్నెలో 2.44 టీఎంసీల నిల్వ..
గాజులదిన్నె ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 4.50 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.44 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎల్ఎల్సీ నుంచి 171 క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతుండగా, ఆవిరి, ఇతర అవసరాలకు పరిమిత స్థాయిలో నీటి వినియోగం కొనసాగుతోంది.
సుంకేసుల బ్యారేజీలో నిల్వలు..
సుంకేసుల బ్యారేజీ పూర్తి నిల్వ సామర్థ్యం 1.235 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.719 టీఎంసీల నీరు ఉంది. బ్యారేజీ ద్వారా కేసీ కాలువకు 1,590 క్యూసెక్కులు, ఎస్కేప్ ద్వారా 5 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మొత్తం విడుదల 1,595 క్యూసెక్కులుగా నమోదైంది.
చిన్న జలాశయాల్లోనూ ఆశాజనక పరిస్థితి..
కృష్ణగిరి జలాశయంలో 0.013 టీఎంసీలు, జుర్రేరు జలాశయంలో 0.07 టీఎంసీలు, అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో ప్రస్తుతం నిల్వలు లేకపోయినా, ఇతర ప్రధాన జలాశయాల్లో నీటి లభ్యత మెరుగ్గా ఉంది.
శ్రీశైలం జలాశయంలో 118.62 టీఎంసీల నిల్వ..
శ్రీశైలం జలాశయం పూర్తి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 118.62 టీఎంసీల నీరు ఉంది. జలాశయానికి 24,518.3 క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతుండగా, 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్, విద్యుత్ ఉత్పత్తి, దిగువ ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా నీటి వినియోగం కొనసాగుతోంది.
వెలిగోడు, గోరకల్లు జలాశయాల్లో పరిస్థితి..
వెలిగోడు జలాశయంలో 1.645 టీఎంసీల, గోరకల్లు జలాశయంలో 2.478 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది. ప్రస్తుతం ఈ రెండు జలాశయాల నుంచి నీటి విడుదల లేదు. సాగునీటి అవసరాలను బట్టి తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ఓవీకే, వరదరాజుల, జుర్రెవుల ప్రాజెక్టులు..
ఓవీకే జలాశయంలో 0.767 టీఎంసీల, వరదరాజుల ప్రాజెక్టులో 0.027 టీఎంసీల, జు ర్రెవుల జలాశయంలో 0.58 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రస్తుతం గణనీయమైన నీటి విడుదలలు లేవని అధికారులు పేర్కొన్నారు.
పులికనుమ జలాశయం..
పులికనుమ జలాశయంలో ప్రస్తుతం 0.05 టీఎంసీల నీటి నిల్వ ఉంది. తాగునీటి అవసరాల కోసం 100 క్యూసెక్కుల మేర విడుదల కొనసాగుతోంది. మొత్తంగాజిల్లాలోని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో పెరుగుతున్నాయి. ముఖ్యంగా తుంగభద్ర, శ్రీశైలం, గాజులదిన్నె వంటి ప్రధాన ప్రాజెక్టుల్లో నమోదైన నిల్వలు ఖరీఫ్ సాగుకు ఊరటనిచ్చేలా ఉన్నాయి.
అయితే కొన్ని మధ్యతరహా, చిన్న జలాశయాల్లో నిల్వలు ఇంకా పరిమితంగానే ఉండటంతో వర్షపాతం కొనసాగడం అవసరమని నీటిపారుదల శాఖ అధికారులు భావిస్తున్నారు. సాగునీటి పంపిణీ, తాగునీటి అవసరాలు, దిగువ ప్రాంతాల భద్రతను దృష్టిలో ఉంచుకొని నీటి విడుదలలను సమన్వయంతో నిర్వహిస్తున్నట్లు నివేదికలో పేర్కొన్నారు.

