ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యం ..
- ఆస్పత్రిలో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి
- సూపరింటెండెంట్కు కలెక్టర్ రాహుల్ శర్మ సూచన
ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా వైద్య సిబ్బంది సమన్వయం, అంకితభావంతో విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ వెంకటరత్నం బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ఆస్పత్రిలో వైద్య సేవల నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సత్వర, మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఆస్పత్రి పరిశుభ్రతను పకడ్బందీగా నిర్వహించడంతో పాటు సిబ్బంది సమయపాలనపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. వైద్య సేవల పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగేలా బాధ్యతాయుతంగా పనిచేస్తూ, ప్రభుత్వ ఆస్పత్రిని ఆదర్శంగా తీర్చిదిద్దాలని డాక్టర్ వెంకటరత్నంకు కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు.
