Nara Lokesh | చంద్రన్న.. బ్రాండ్!
Nara Lokesh | చంద్రన్న.. బ్రాండ్!
Nara Lokesh | ఇంటింటికీ కూటమి సర్కార్
45 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమం
ప్రజా చైతన్యానికి విస్తృత ప్రచారం
ఈ నెల 25నుంచి రాష్ట్రమంతటా ప్రారంభం
అమలుచేస్తున్న పథకాల కరపత్రాల పంపణీ
రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల వివరాలతో ఫ్లెక్సీలు
ఉద్యోగ కల్పనపై యువతకు అవగాహన కలిగేలా సదస్సులు
2029లో భారీ గెలుపు లక్ష్యంగా మంత్రి లోకేష్ స్కెచ్
Nara Lokesh | అమరావతి, ఆంధ్రప్రభ : అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. ప్రభుత్వం చేసిన పనులను ప్రతి ఇంటికి తీసుకెళ్లడం ఇప్పుడు పార్టీ కేడర్ ముందున్న ప్రధాన బాధ్యత అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కీలక దిశానిర్దేశం చేశారు. జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. గ్రామం నుంచి పట్టణం వరకు ప్రతి గడపను తట్టి ప్రభుత్వం చేసిన మంచి పనులను వివరించాలని లోకేష్ పిలుపునిచ్చారు.
ప్రతి ఇంటికీ ప్రభుత్వ పనుల వివరాలు
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని లోకేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి కరపత్రాలు, బుక్లెట్లు పంపిణీ చేయాలని సూచించారు. రెండేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, ప్రజలకు అందిన ప్రయోజనాలు, భవిష్యత్ ప్రణాళికలను నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్లాలని అన్నారు. ప్రజలతో ముఖాముఖి మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకోవడం కూడా ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్గా నిలిచారని లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చేపడుతున్న ప్రాజెక్టులు, పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక సదుపాయాల విస్తరణ వంటి అంశాలను ప్రజలకు వివరించాలని సూచించారు. పెట్టుబడులు తీసుకురావడం, ఉద్యోగావకాశాలు పెంచడం, పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకోవడం వంటి అంశాలను ప్రజల్లో చర్చకు తీసుకెళ్లాలని చెప్పారు.
సంక్షేమ పథకాలే కూటమి బలం
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని లోకేష్ స్పష్టం చేశారు. “తల్లికి వందనం” పథకం ద్వారా తల్లులకు అందిస్తున్న ఆర్థిక సహాయం, “దీపం-2” ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు, రూ.4 వేల ఎన్టీఆర్ భరోసా పెన్షన్, ఆటో డ్రైవర్లకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, “అన్నదాత సుఖీభవ” వంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. దేశంలోనే అత్యధిక సామాజిక భద్రతా పెన్షన్లు అందిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని, రైతులు, మహిళలు, కార్మికులు, వృద్ధులు, విద్యార్థులు సహా అన్ని వర్గాల కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోందని ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు.
2019 ఓటమి నుంచి నేర్చుకున్న పాఠం
2014 నుంచి 2019 మధ్యకాలంలో తెలుగుదేశం ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా వాటిని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైందని లోకేష్ గుర్తు చేశారు. ప్రభుత్వం చేసిన పనులను చెప్పుకోకపోవడం, ప్రత్యర్థుల ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టలేకపోవడంతో ఎన్నికల్లో నష్టం జరిగిందని అభిప్రాయపడ్డారు.చేసిన మంచి పనులను ప్రజలకు తెలియజేయకపోతే అవి బూడిదలో పోసిన పన్నీరులా మారిపోతాయని వ్యాఖ్యానించారు. అందుకే ఈసారి ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ప్రజల మధ్యకు వెళ్లి వాస్తవాలను వివరించాలని సూచించారు.
ఈ కార్యక్రమాన్ని కేవలం టీడీపీ కార్యక్రమంగా కాకుండా కూటమి కార్యక్రమంగా నిర్వహించాలని లోకేష్ స్పష్టం చేశారు. జనసేన, బీజేపీ కేడర్ను కూడా భాగస్వామ్యం చేసుకొని సంయుక్తంగా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. కూటమి ప్రభుత్వ విజయాలను అన్ని పార్టీల కార్యకర్తలు కలిసికట్టుగా ప్రజలకు వివరించాలని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం మూడు పార్టీల సమన్వయం ఎంతో కీలకమని అభిప్రాయపడ్డారు.
విజయోత్సవ సభలతో ప్రజల్లోకి సందేశం
జూన్ 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో విజయోత్సవ సభలు నిర్వహించాలని లోకేష్ సూచించారు. ఈ సభల ద్వారా కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలని అన్నారు. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, భవిష్యత్ లక్ష్యాలపై ప్రజల్లో చర్చ జరిగేలా చూడాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు.
ఓటరు జాబితాపై ప్రత్యేక దృష్టి
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియపై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని లోకేష్ సూచించారు. ఓటరు జాబితాలో ఒక్క ఓటు కూడా కోల్పోకుండా చూసుకోవడం నాయకుల బాధ్యత అని స్పష్టం చేశారు. ఇప్పటికే బూత్ లెవల్ ఏజెంట్ల నియామకం, శిక్షణా కార్యక్రమాలు పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రతి ఎమ్మెల్యే, నియోజకవర్గ నాయకుడు బీఎల్ఏలతో నిరంతరం సంప్రదింపులు జరపాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించాలని పార్టీ నాయకత్వం ఆదేశించింది. ఎక్కడైనా ఓటరు జాబితా సంబంధిత సమస్యలు తలెత్తితే పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓటర్ వెరిఫికేషన్ సెల్ను సంప్రదించాలని లోకేష్ సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన హక్కు అని, ప్రతి అర్హుడైన ఓటరు జాబితాలో ఉండేలా పార్టీ నాయకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు.
2029 లక్ష్యంగా టీడీపీ వ్యూహం
లోకేష్ తాజా పిలుపు చూస్తే కూటమి ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు చేరవేయడమే కాకుండా పార్టీ సంస్థాగత బలాన్ని మరింత పెంచే లక్ష్యంతో టీడీపీ ముందుకు సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. గడపగడపకు వెళ్లే ఈ 45 రోజుల కార్యక్రమం ద్వారా ప్రభుత్వ విజయాలను ప్రజలకు చేరవేయడం, కూటమి ఐక్యతను బలోపేతం చేయడం, ఓటరు జాబితాలపై పట్టు సాధించడం వంటి మూడు ప్రధాన లక్ష్యాలను పార్టీ ముందుంచినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేడర్ను క్షేత్రస్థాయిలో మరింత చురుకుగా మార్చే ప్రయత్నంగా ఈ కార్యక్రమాన్ని భావిస్తున్నారు. ప్రభుత్వం చేసిన పనులను ప్రజల మద్దతుగా మలచగలిగితే కూటమికి ఇది కీలక రాజకీయ బలంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
