Humanoid Robo | త్వ‌ర‌లో ర‌ణ‌రంగంలో సైనిక రోబో… రూప‌క‌ల్ప‌న‌లో డిఆర్డీవో…

బెంగ‌ళూరు – భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) సరికొత్త ఆవిష్కరణ దిశగా కీలక అడుగులు వేస్తోంది. సరిహద్దుల్లోని క్లిష్టమైన సైనిక కార్యకలాపాల్లో భద్రతా దళాలకు అండగా నిలిచేందుకు, మానవ ప్రమేయాన్ని తగ్గించి ప్రాణనష్టాన్ని నివారించే లక్ష్యంతో ఒక ‘హ్యూమనాయిడ్ రోబో’ను అభివృద్ధి చేస్తున్నట్లు డీఆర్‌డీఓ ఈరోజు వెల్లడించింది. ఈ రోబో సైనికుల మాదిరి నడుస్తూ, మానవ ఆదేశాలను స్వీకరించి, నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయగలదు.

దేశ రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసే క్రమంలో డీఆర్‌డీఓ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును చేపట్టింది. ప్రమాదకరమైన వాతావరణంలో, ముఖ్యంగా ఫ్రంట్‌లైన్ మిషన్లలో సైనికులు ప్రత్యక్షంగా పాల్గొనాల్సిన అవసరాన్ని తగ్గించడమే ఈ రోబో రూపకల్పన వెనుక ప్రధాన ఉద్దేశమని డీఆర్‌డీఓకు చెందిన ఒక సీనియర్ అధికారి తెలిపారు. మానవ సైనికులకు బదులుగా ఈ రోబోలు శత్రువుల కాల్పులను ఎదుర్కోవడం, నిఘా కార్యకలాపాలు చేపట్టడం వంటివి చేయగలవని ఆయన వివరించారు.

ఈ ప్రాజెక్టులో పాలుపంచుకుంటున్న ఒక కీలక ఇంజనీర్ మాట్లాడుతూ, “ఈ హ్యూమనాయిడ్ రోబోను, ఆపరేటర్ ఇచ్చే ఆదేశాలను అర్థం చేసుకుని, వాటిని కచ్చితత్వంతో అమలు చేసేలా తీర్చిదిద్దుతున్నాం. ముఖ్యంగా అటవీ ప్రాంతాలు, కొండచరియలు వంటి కఠినమైన భూభాగాలపై కూడా సమర్థవంతంగా నడిచేలా దీని కాళ్లను రూపొందిస్తున్నాం” అని తెలిపారు. అంతర్గతంగా నిర్వహించిన కొన్ని కీలక పరీక్షల్లో ఈ రోబో ఇప్పటికే విజయవంతంగా తన సామర్థ్యాన్ని నిరూపించుకుందని అధికారులు పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ రోబో ఇంకా అభివృద్ధి దశలోనే ఉందని, ఆపరేటర్ల నుంచి అందే ఆదేశాలను మరింత మెరుగ్గా అర్థం చేసుకుని, సంక్లిష్టమైన పనులను కూడా పూర్తిచేయగల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు శాస్త్రవేత్తల బృందం నిరంతరం కృషి చేస్తోంది. 2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి, భారత సైన్యానికి ఈ అధునాతన రోబోలను అందించాలనే లక్ష్యంతో పరిశోధకులు ముందుకు సాగుతున్నట్లు డీఆర్‌డీఓ వర్గాలు వెల్లడించాయి. ఈ హ్యూమనాయిడ్ రోబోలు అందుబాటులోకి వస్తే, భారత సైనిక సామర్థ్యం మరింత ఇనుమడిస్తుందని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *