హైదరాబాద్ : భారత్ – పాకిస్థాన్ యుద్ధ ప్రభావం హైదరాబాద్ లో జరిగే మిస్ వరల్డ్ -2025 పోటీలపై పడింది. నేటి సాయంత్రం జరగనున్న 72వ మిస్ వరల్డ్ పోటీల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. యుద్ధం నేపథ్యంలోనే దూరంగా ఉంటున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన డిన్నర్ ను కూడా రద్దు చేసుకున్నారు.
ఇదిలా ఉండగా.. ఇండో – పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మిస్ వరల్డ్ పోటీలను రద్దు చేయాలని, లేదా వాయిదా వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. నేటి నుంచి ఈనెల 31వ తేదీ వరకూ నగరంలోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట బందోబస్త్ ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 1న హైటెక్స్ లో గ్రాండ్ ఫినాలే జరగనుండగా.. 120 దేశాలకు చెందిన సుందరీమణులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు.