‘మష్రూమ్ మిషన్’.. ఏపీలో భారీ ప్రణాళిక

‘మష్రూమ్ మిషన్’.. ఏపీలో భారీ ప్రణాళిక

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు సమాయత్తమవుతోంది. అందులో భాగంగా పొదుపు సంఘాలకు చేయూతనివ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మష్రూమ్ మిషన్ ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టబోతున్నారు. 2026-31 మధ్యకాలంలో ఈ మిషన్ ద్వారా పొదుపు సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయనున్నారు. ఇందుకోసం సుమారు రూ.12,960 కోట్ల మేరకు నిధులతో భారీ ప్రాజెక్టును చేపట్టబోతున్నారు.

ఆంధ్రప్రదేశ్ మహిళల ఆర్థిక సాధికారతను కొత్త పుంతలు తొక్కించేలా ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ముఖ్యంగా పుట్టగొడుగుల సాగును ఒక లాభసాటి పరిశ్రమగా మార్చే లక్ష్యంతో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏపీ మష్రూమ్ మిషన్ 2026-31కి శ్రీకారం చుట్టారు. సుమారు 12,960 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో అమలు చేయనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో పుట్టగొడుగుల ఉత్పత్తిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే కాకుండా, లక్షలాది మంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది.

మష్రూమ్ మిషన్‌లో అత్యంత కీలకమైన అంశం మహిళల భాగస్వామ్యం. రాష్ట్రంలోని పొదుపు సంఘాల మహిళలకు ఈ ప్రాజెక్టులో ప్రభుత్వం అగ్రతాంబూలం ఇచ్చింది. గ్రామాల్లోని మహిళా సంఘాలకు పుట్టగొడుగుల సాగుపై ప్రత్యేక శిక్షణ ఇచ్చి, వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దనున్నారు. పుట్టగొడుగుల పెంపకానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ, వారి ఆర్థిక భరోసాకు ఈ మిషన్ ఒక బలమైన పునాదిగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే మార్గంగా పుట్టగొడుగుల సాగును మహిళలకు చేరువ చేయనున్నారు.

భారీ రాయితీలు.. పారిశ్రామిక ప్రోత్సాహం
ఈ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సాగుదారులకు 40 శాతం రాయితీని ప్రకటించింది. పుట్టగొడుగులను కేవలం ఒక ఉద్యాన పంటగానే కాకుండా, పూర్తిస్థాయి వ్యవసాయ ఉత్పత్తిగా గుర్తిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల రైతులకు ఇతర పంటలకు లభించే ప్రయోజనాలన్నీ పుట్టగొడుగుల సాగుకు కూడా వర్తిస్తాయి. రాష్ట్ర పారిశ్రామిక విధానం కింద రోజుకు 10 టన్నుల సామర్థ్యం గల భారీ యూనిట్ల స్థాపనతో పాటు, చిన్న తరహా యూనిట్లకు కూడా ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలు అందించనుంది.

ఉత్పత్తి లక్ష్యం – రకాల ఎంపిక
ప్రస్తుతం దేశంలో పుట్టగొడుగుల ఉత్పత్తిలో బీహార్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ ఆ స్థానాన్ని అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏటా లక్ష మెట్రిక్ టన్నుల దిగుబడి సాధించాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. మన రాష్ట్ర వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండే మిల్కీ మష్రూమ్స్, వరి గడ్డి ఆధారిత రకాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో మంచి గిరాకీ ఉన్న బటన్ మష్రూమ్స్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించనున్నారు.

అంతర్జాతీయ స్థాయిలో వినూత్న పంటల సాగు
మష్రూమ్ మిషన్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సాగు విధానాల్లో వినూత్న మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. అరకు ఏజెన్సీ ప్రాంతంలో అత్యంత ఖరీదైన కుంకుమ పువ్వు సాగుపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. అనంతపురం జిల్లాలో ఇప్పటికే సత్ఫలితాలను ఇస్తున్న ఆపిల్ సాగుతో పాటు అవకాడో, అంజీర్, పనస వంటి పంటలను పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సాగు చేయనున్నారు. అంజీర్ వంటి పండ్లను డ్రై ఫ్రూట్స్‌గా మార్చి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం కల్పించేలా ప్రణాళికలు రూపొందించారు.

Leave a Reply