రైతులకు సకాలంలో పామాయిల్ మొక్కలు అందించాలి
దమ్మపేట (ఆంధ్రప్రభ): తెలంగాణలో పామాయిల్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో పామాయిల్ మొక్కలను అందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని గండుగులపల్లిలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆయిల్ఫెడ్ ప్రత్యేక అధికారి సుధాకర్రెడ్డి బుధవారం మంత్రిని కలిసి పామాయిల్ సాగు, మొక్కల లభ్యతపై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ రాష్ట్రంలో పామాయిల్ సాగు విస్తరణకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఆయిల్ఫెడ్లో మొక్కల కొరత ఏర్పడితే ప్రైవేటు నర్సరీల నుంచి మొక్కలను సమీకరించి రైతులకు నిరంతరాయంగా సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రావు గంగాధరరావు, మాజీ జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, దొడ్డాకుల రాజేశ్వరరావు, కాసాని నాగప్రసాద్, ఎర్రా వసంతరావు, మన్నెం అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.
