ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఆసియాకప్ (Asia Cup) 2025లో పాకిస్థాన్ (Pakistan) ఇవాళ యూఏఈతో ఢీకొనబోతోంది. ఈ మ్యాచ్లో పాక్ గెలిస్తేనే సూపర్ ఫోర్ (Super Four)కి అర్హత సాధిస్తోంది. ఇప్పటికే భారత్ సూపర్ 4కి అర్హత సాధించింది. మరో బెర్త్ను కన్ఫర్మ్ చేసుకోవాలని పాక్ చూస్తోంది. గ్రూపు ఏలో భారత్తో పాటు పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ లు ఉన్నాయి. గ్రూపు-ఏ నుంచి టాప్-2 స్థానాల్లో నిలిచిన రెండు జట్లు మాత్రమే సూపర్-4కి వెలుతాయన్న సంగతి తెలిసిందే. ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓడిపోయిన ఒమన్ రేసు నుంచి నిష్ర్కమించింది. ఇక మిగిలిన రెండో బెర్తు కోసం పాకిస్తాన్, యూఏఈ జట్టు పోటీపడుతున్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటికే టోర్నీలో చెరో రెండు మ్యాచ్లు ఆడగా ఒక్కొ మ్యాచ్లో గెలుపొందాయి. రెండు జట్ల ఖాతాలోనూ చెరో 2 పాయింట్లు ఉన్నాయి.

బుధవారం యూఏఈ, పాక్ జట్ల మధ్య దుబాయ్ (Dubai) వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నాలుగు పాయింట్లతో సూపర్-4లో అడుగుపెడుతుంది. ఈ మ్యాచ్ యూఏఈ (UAE)కి ఓ అద్భుత అవకాశం అని చెప్పవచ్చు. ఈ మ్యాచ్లో గెలిస్తే నేరుగా సూపర్4కి వెలుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దు అయినా, టై అయినా కూడా ఇరు జట్లకు చెరో పాయింట్ను కేటాయిస్తారు. అప్పుడు కూడా రెండు జట్ల ఖాతాలో సమానంగా పాయింట్లు ఉంటాయి. మెరుగైన నెట్ రన్రేటు కలిగి ఉన్న జట్టు సూపర్4లో అడుగుపెడుతోంది. ప్రస్తుతం పాక్ నెట్రన్రేటు +1.649గా ఉంది. యూఏఈ నెట్రన్రేటు -2.030గా ఉంది. ఈ లెక్కన మ్యాచ్ టై అయినా, రద్దు అయినా కూడా మెరుగైన రన్రేటు ఉన్న పాక్ జట్టు సూపర్4లో అడుగుపెడుతుంది.

