AP | కుప్పంను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా : చంద్రబాబు

కుప్పం, జూలై 2 (ఆంధ్రప్రభ ): తన నియోజకవర్గమైన కుప్పాన్ని దేశంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) హామీ ఇచ్చారు. బుధవారం కుప్పంలో పర్యటించిన ఆయన, ‘స్వర్ణ కుప్పం’ ప్రాజెక్టులో భాగంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో మాట్లాడుతూ… విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని తిరిగి వికాసం వైపు నడిపిస్తున్నామని స్పష్టం చేశారు.

కుప్పం నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నమైన హంద్రీనీవా (Handri-Neeva) నీళ్లను ఈ ఏడాదిలోనే అందిస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. రూ. 3,890 కోట్ల వ్యయంతో హంద్రీనీవా పనులను పూర్తి చేసి, నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరు పారిస్తామని తెలిపారు. “అభివృద్ధి చేసే వారికే సంక్షేమం గురించి మాట్లాడే హక్కు ఉంటుంది. అప్పులు తెచ్చి సంక్షేమం చేస్తామనడం సరైన పరిపాలన కాదు,” అని ఆయన అన్నారు. అభివృద్ధి ద్వారా ఆదాయాన్ని సృష్టించి, దానిని సంక్షేమ పథకాలకు ఖర్చు చేయడమే సరైన ఆర్థిక విధానమని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం గత ఏడాదిగా ఇదే పాలసీని అనుసరిస్తోందని వివరించారు.

స్వర్ణ కుప్పం (swarna kuppam) ప్రాజెక్టు కింద నియోజకవర్గంలో మొత్తం రూ. 1292 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ఇప్పటికే రూ. 125 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా నియోజకవర్గంలోని రహదారులన్నింటినీ సీసీ, బీటీ రోడ్లుగా మార్చనున్నామని, రాష్ట్రవ్యాప్తంగా గుంతలు లేని రహదారులను నిర్మించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులతోనే ఏడాదిగా సుపరిపాలన అందిస్తున్నామని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా మహిళల కోసం ‘దీపం 2.0’ పథకాన్ని ప్రస్తావించారు. గతంలో తాము ప్రవేశపెట్టిన ‘దీపం’ పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు అందిస్తే, ఇప్పుడు ‘దీపం 2.0’ ద్వారా అర్హులైన మహిళలందరికీ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు (Gas cylinders) అందిస్తున్నామని చెప్పారు. దీనివల్ల కుప్పం నియోజకవర్గంలోని ప్రతి ఇంటిలోనూ వంట గ్యాస్ అందుబాటులోకి వచ్చిందని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. సుపరిపాలనలో భాగంగానే ప్రజల ముందుకు వచ్చానని, ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటానని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply