హైదరాబాద్ : హైదరాబాద్ లోని కేపీహెచ్ బీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ తన చెల్లెలి సాయంతో కట్టుకున్న భర్తను తుదముట్టించింది. కరెంట్ షాక్ ఇచ్చి చంపి, మృతదేహాన్ని పూడ్చిపెట్టింది. అనంతరం చుట్టుపక్కల వారిని నమ్మించేందుకు కట్టుకథలు అల్లింది. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్ బీకి చెందిన సాయిలు, కవిత దంపతులు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈ దంపతులు మనస్పర్థలతో విడివిడిగా ఉంటున్నారు. భార్యకు, భర్తకు ఇద్దరికీ వివాహేతర సంబంధాలున్నాయి. అయితే తరచుగా భార్య ఉంటున్న ఇంటికి వచ్చి సాయిలు వేధింపులకు పాల్పడే వాడని సమాచారం. దీంతో విసిగిపోయిన కవిత భర్తను వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. ఇందుకు చెల్లెలు, చెల్లెలి భర్త సాయం తీసుకుంది.
ముగ్గురూ కలిసి ప్లాన్ చేసి సాయిలును కరెంట్ షాక్ తో చంపేశారు. ఆపై గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని పాతిపెట్టి కవిత సొంతూరుకు వెళ్లిపోయింది. సాయిలు గురించి అడిగిన వారికి కట్టుకథలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేసింది. పనికి వెళ్లి తిరిగిరాలేదని చెప్పింది. అయితే, కవిత తీరు అనుమానాస్పదంగా ఉండడంతో సాయిలు బంధువులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు.. కవితను ప్రశ్నించగా నేరం అంగీకరించింది. పోలీసులు కవితను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.