సెప్టెంబర్ దర్శన కోటా కోసం ఎదురుచూస్తున్నారా..?
సెప్టెంబర్ దర్శన కోటా కోసం ఎదురుచూస్తున్నారా..?
టీటీడీ కీలక షెడ్యూల్ విడుదల
తిరుమల, ఆంధ్రప్రభ : సెప్టెంబర్ నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేయనున్న వివిధ దర్శనాలు, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటా వివరాలను ప్రకటించింది.
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలు) కోసం ఎలక్ట్రానిక్ డిప్ నమోదు ప్రక్రియను జూన్ 18న ఉదయం 10 గంటలకు ప్రారంభించనుంది. భక్తులు జూన్ 20 ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు.
ఎలక్ట్రానిక్ డిప్లో ఎంపికైన భక్తులు జూన్ 20 నుంచి 22 మధ్యాహ్నం 12 గంటల లోపు టికెట్ మొత్తాన్ని చెల్లిస్తే సేవా టికెట్లు మంజూరవుతాయి.
జూన్ 22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్ల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటికి అనుబంధంగా ఉన్న దర్శన స్లాట్ల కోటాను విడుదల చేయనుంది.
జూన్ 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్ల కోటా, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు.
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తుల కోసం ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను జూన్ 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు.
ప్రత్యేక ప్రవేశ దర్శన (రూ.300) టికెట్ల కోటాను జూన్ 24న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.
తిరుమల, తిరుపతిలోని వసతి గదుల కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు.
భక్తులు శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, వసతి గదులను టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
