సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి
అధికారులకు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచనలు
కుంటాల, ఆంధ్రప్రభ: అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచించారు. శనివారం మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ అధ్యక్షతన మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
రాజకీయాలకు అతీతంగా సర్పంచులు గ్రామాల అవసరాలను తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవాలని చెప్పారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు తమ శాఖల ప్రగతి నివేదికలను వివరించారు.
సర్పంచులు ప్రస్తావించిన సమస్యలను 45 రోజుల్లోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు.
గ్రామాల్లో మహిళా సమాఖ్య భవనాలు, గ్రామపంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన పనులను పూర్తి చేసే బాధ్యత సర్పంచులపై ఉంటుందని పేర్కొన్నారు.
పోడు భూముల్లో పదేళ్లుగా సాగు చేస్తున్న గిరిజన రైతులను అటవీ శాఖ అధికారులు ఇబ్బందులకు గురిచేయవద్దని ఆదేశించారు. వివిధ శాఖల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామీణ స్థాయిలో సమర్థంగా అమలు చేసి అభివృద్ధికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై వైద్య శాఖ అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన అందించి విద్యార్థుల విద్యా ప్రమాణాలను పెంచాలని సూచించారు. గ్రామాల్లోని సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని, ప్రతి అధికారి ప్రజలకు అందుబాటులో ఉండి సేవాభావంతో పనిచేయాలని అన్నారు. గ్రామాల్లో ఏ సమస్య ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారంతో పాటు అవసరమైన నిధుల మంజూరుకు కృషి చేస్తానని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ ఆడే కమల్ సింగ్, ఎంపీడీవో అల్లాడి వనజ, ఎంపీవో శోభన, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
