ఆసుపత్రుల అనుమతులపై అత్యవసర సమావేశం

ఆసుపత్రుల అనుమతులపై అత్యవసర సమావేశం

వరంగల్, ఆంధ్రప్రభ ప్రతినిధి: ఆసుపత్రుల అనుమతులు, రెన్యువల్స్‌పై చర్చించేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. సాంబశివరావు తన చాంబర్‌లో అత్యవసర సమావేశం నిర్వహించారు. నర్సంపేట డివిజన్ ఐఎంఏ కార్యవర్గ డాక్టర్లతో ఈ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా డాక్టర్ల సలహాలు, సూచనలు తెలుసుకున్నారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ ప్రకారం ఆసుపత్రుల రెన్యువల్స్‌, కొత్త రిజిస్ట్రేషన్లకు అవసరమైన డాక్యుమెంట్లపై చర్చించారు.

అన్ని అవసరమైన పత్రాలు సమర్పించిన తర్వాత కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ అధ్యక్షతన క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ కమిటీ సభ్యులు పరిశీలించి ఆసుపత్రి రిజిస్ట్రేషన్ జారీ చేసే అవకాశం ఉంటుందని డాక్టర్ సాంబశివరావు తెలిపారు.

ఆసుపత్రుల అనుమతులకు అగ్నిమాపక శాఖ అనుమతులు తప్పనిసరిగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఫైర్ అనుమతులు లేకపోతే రెన్యువల్ చేయడం సాధ్యం కాదని పేర్కొన్నారు.

ఫైర్ ఆఫీసర్ ఎడ్ల నారాయణ మాట్లాడుతూ.. ఫైర్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం ప్రైవేట్ ఆసుపత్రులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలన్నారు. నిబంధనలు పాటించని ఆసుపత్రులకు ఫైర్ ఎన్ఓసీ ఇవ్వడం వీలు కాదని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నర్సంపేట ఐఎంఏ అధ్యక్షుడు జయుడు, కార్యదర్శి భారతి, డాక్టర్లు కిషన్, విద్యాసాగర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, రాజేష్, ఎడ్ల రమేష్, కంటెం రవికిరణ్, ములుగు సతీష్, కావటి విజయ్, విజయపాల్‌రెడ్డి, మనోజ్‌లాల్, సంపత్, ఎస్‌ఎఫ్‌ఓ మోహన్‌రావు, ఫైర్ ఫైటర్ దేవేందర్‌రెడ్డి, డెమో అనిల్, ఎస్‌ఓ విజయలక్ష్మి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.