మతాల పేరుతో రాజకీయాలు చేస్తే ఫలితాలు శూన్యం..

మతాల పేరుతో రాజకీయాలు చేస్తే ఫలితాలు శూన్యం..

  • మైనార్టీల సంక్షేమానికి సర్కార్ కృషి..
  • జగిత్యాలలో మైనార్టీ డిగ్రీ కళాశాల ఏర్పాటు
  • రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్

జగిత్యాల, ఆంధ్రప్రభ : మతాల పేరుతో రాజకీయాలు చేస్తే అభివృద్ధి శూన్యమని, తాను మత రాజకీయాలకు దూరంగా ఉంటానని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ అన్నారు. జగిత్యాలలో మంత్రి అజారుద్దీన్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నందయ్యతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అజారుద్దీన్ మాట్లాడుతూ 1969 నుండి మొదలుకొని అనేక ఉద్యమాలు చేపట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు స్వరాష్ట్రాన్ని 2014లో సాధించుకున్నారన్నారు. క్రికెటర్గా తన కెరియర్ ప్రారంభించి ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నానని తెలిపారు.

మతాల పేరుతో కొందరు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అజారుద్దీన్ అన్నారు. గత రాజకీయాలకు తాను దూరంగా ఉంటానని టీం వర్క్ చేస్తేనే ఫలితాలు వస్తాయని అజారుద్దీన్ తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రైసింగ్ తెలంగాణ పేరుతో ముందుకు సాగుతూ ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణకు గుర్తింపు తీసుకు వస్తున్నారని మంత్రి అన్నారు. విద్యా ద్వారానే సమాజంలో మార్పులు వస్తాయని ఎందుకు అనుగుణంగా విద్య వ్యవస్థలో ముఖ్యమంత్రి గారు సమూల మార్పులు తీసుకువచ్చారని మంత్రి అజారుద్దీన్ తెలిపారు. జగిత్యాల జిల్లాలో మైనార్టీ సమస్యలు ఉన్నాయన్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మైనార్టీల సమస్యలపై ఒక సమావేశం ఏర్పాటు చేయాలని అజారుద్దీన్ స్థానిక నాయకులను కోరారు. జిల్లా కేంద్రంలో ఈద్గా, ఖబరస్థాన్ ఏర్పాటుపై కలెక్టర్తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానన్నారు. విద్యార్థుల స్కాలర్ షిప్ సమస్యను పరిష్కరిస్తానని మంత్రి తెలిపారు. జగిత్యాలలో మెడికల్ కాలేజ్ను చూస్తే సంతోషంగా ఉందన్నారు. జిల్లా కేంద్రంలోని ఉర్దూ పాఠశాల సమస్యని పరిష్కరిస్తాని పేర్కొన్నారు. నేను బ్యాటింగ్ ఎంత స్పీడ్గా చేస్తానో.. మంత్రిగా కూడా అలానే పని చె స్తానన్నారు. జగిత్యాలలో మైనార్టీ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.

గ్రామీణ ప్రాంతాల్లోనే క్రీడాకారులకు సైతం జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా తనవంతుగా కృషి చేస్తానని తెలిపారు. జగిత్యాల జిల్లాలోని మైనార్టీ సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి మంత్రి అజారుద్దీన్ కృషి చేయాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ కోరారు. క్రీడకారునిగా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన అజారుద్దీన్ తెలంగాణ రాష్ట్ర ప్రజల సేవ చేయడానికి రాజకీయాల్లోకి రావడం చాలా సంతోషమన్నారు. క్రీడాకారులకు కులం, మతం ఉండదని తెలిపారు. అజారుద్దీన్ మంత్రిగా రాణించి అందరి మన్ననలు పొందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.