Data by 2028 | గూగుల్‌.. గేమ్ చేంజ‌ర్..

Data by 2028 | గూగుల్‌.. గేమ్ చేంజ‌ర్..

2028 నాటికి డేటా కార్య‌క‌లాపాలు
ఏపీలో కొత్త చ‌రిత్ర ప్రారంభం
దేశానికి గ్రోత్ ఇంజన్‌గా విశాఖ న‌గ‌రం
ఎయిర్ టెల్, అదానీ, మిట్ట‌ల్ వంటి సంస్థ‌లు రాక హ‌ర్ష‌ణీయం
ఇక ఏఐకి స‌రికొత్త చిరునామా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
ఏపీ డిజిటల్‌ భవిష్యత్తుకు పునాది
తొలి ద‌శ‌లోనే 60 వేల‌కు పైగా ఉద్యోగాలు
గూగుల్ డేటా సెంటర్ భూమి పూజ కార్య‌క్ర‌మంలో చంద్ర‌బాబు

Data by 2028 | విశాఖ‌ప‌ట్నం, ఆంధ్ర‌ప్ర‌భ : గూగుల్ రాక విశాఖకే కాదు ఏపీకి గేమ్ చేంజర్ అవుతుంద‌ని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇవాళ మరచిపోలేని రోజుగా చెప్పారు. చరిత్రకు శ్రీకారం చుట్టబోయే రోజుగా వర్ణించారు. కేంద్రప్రభుత్వం-గూగుల్ సంస్థకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఏపీ రాష్ట్ర భవిష్యత్తును మార్చివేయగల ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్‌కు మంగ‌ళ‌వారం శంకుస్థాపన జరిగింది. విశాఖ జిల్లా తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌, ఐటీ మంత్రి లోకేశ్‌, కేంద్రమంత్రులు రామ్మోహన్‌నాయుడు, శ్రీనివాసవర్మ భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో గూగుల్‌ క్లౌడ్ వైస్‌ ప్రెసిడెంట్ వికాస్ కోలీ, అదానీ పోర్ట్స్‌ అండ్ సెజ్ ఎండీ కరణ్ అదానీ పాల్గొన్నారు. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

Data by 2028 | దేశానికే గ్రోత్ ఇంజ‌న్..

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ 1997లో హైటెక్ సిటీతో ప్రారంభించామన్నారు. గూగుల్ ఐఏ డేటా సెంటర్.. ఏపీ టెక్నాలజీతోపాటు దేశానికి గ్రోత్ ఇంజన్‌గా మారుతుందన్నారు. టెక్నాలజీ హబ్‌కు భవిష్యత్తులో తుర్లవాడ పేరు మార్మోగుతోందన్నారు. కొత్త ఆవిష్కరణలకు ఏపీ ఎప్పుడూ స్వాగతం పలుకుతోందన్నారు. దేశానికి ఏపీ అంతర్జాతీయ డేటా గేట్ వేగా నిలుస్తుందన్నారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌ ఏర్పాటుతో భారత్‌కు ఆంధ్రప్రదేశ్‌ అంతర్జాతీయ డేటా గేట్‌వేగా నిలుస్తుందని అన్నారు. డేటా సెంటర్‌ శంకుస్థాపన కార్యక్రమమే కాదని ఏపీ డిజిటల్‌ భవిష్యత్తుకు పునాదిగా అభివర్ణించారు. సెర్చ్ ఇంజిన్ గా మొదలైన గూగుల్, భారత్ గ్రోత్ ఇంజిన్ గా మారబోతోందన్నారు. ఓడరేవుల వంటి కీలక రంగాల్లో పని చేస్తున్న అదానీ గ్రూప్, ప్రజలను కమ్యూనికేషన్‌తో అనుసంధానం చేస్తున్న మరో సంస్థ ఎయిర్ టెల్ అని అన్నారు. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలు ముందుకు రావడం శుభపరిణామంగా చెప్పారు. 2028 సెప్టెంబర్ నాటికి గూగుల్ డేటా సెంటర్ పూర్తి కావాలని, ప్రభుత్వ అన్నివిధాలుగా సహకారం అందిస్తుందన్నారు.

Data by 2028 | ఉత్తరాంధ్రకే గర్వకారణం

విశాఖకు గూగుల్‌ రాక ఉత్తరాంధ్రకే గర్వకారణమని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ ఏర్పాటవుతోందని తెలిపారు. విశాఖను గూగుల్‌ ఎంపిక చేసుకోవడం ఏపీకి గర్వకారణమని వ్యాఖ్యానించారు. గూగుల్‌, ఎయిర్‌టెల్‌ రెండూ కీలక సంస్థలని వెల్లడించారు. సెప్టెంబర్‌ 2028 నాటికి గూగుల్‌ డేటా సెంటర్‌ పూర్తవుతుందని స్పష్టం చేశారు. అతి త్వరలో అన్నిరంగాల్లో ఏఐ సేవలు వస్తాయని వివరించారు. 60 రోజుల్లో అనకాపల్లి, విశాఖపట్నానికి గోదావరి నీళ్లు వస్తాయని చెప్పుకొచ్చారు.

గోదావ‌రి పుష్క‌రాల‌కు ముందే పోల‌వ‌రం ప్రారంభం
గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖకు అద్భుతమైన కనెక్టివిటీ ఉందని తెలిపారు. 2028 చివరినాటికి ఆర్సెలార్‌ మిట్టల్‌ ప్లాంట్‌ తొలిదశ పూర్తి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఏఐ సిటీగా విశాఖ ఉంటుందని.. మరో రంగారెడ్డి జిల్లాగా అనకాపల్లి కాబోతుందని తెలిపారు. టెక్నాలజీలో దేశానికే గేట్‌వేగా ఆంధ్రప్రదేశ్‌ ఉందని వెల్లడించారు. పెట్టుబడిదారులే ఏపీకి భాగస్వాములని చెప్పారు. ఒప్పందాలే కాదని.. గ్రౌండింగ్‌ కూడా తమదే బాధ్యత అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

CLICK HERE TO READ MORE : relief 27k teachers | ఈ ఏడాదిలోనే టీచర్లకు రెండు స్పెషల్ టెట్లు

CLICK HERE TO READ MORE :

Leave a Reply