Jaggareddy | వారిద్దరూ ఆ బూతులకు సమాధానం చెప్పాలి..

Jaggareddy | వారిద్దరూ ఆ బూతులకు సమాధానం చెప్పాలి..
- టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
Jaggareddy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హరీష్ రావు, కేటీఆర్ లు పోలీసు అధికారులను ఉద్దేశించి గతంలో అసభ్య పదజాలంతో దూషించినవి మరిచిపోయారా..? అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఒకవేళ మరిచిపోతే ఆ వీడియోలు పంపిస్తానని, ముందు వారిద్దరు పోలీసులపై వాడిన బూతులకు సమాధానం చెప్పి, ఆ తర్వాతే తన గురించి మాట్లాడాలని బీఆర్ఎస్ సోషల్ మీడియాకు వార్నింగ్ ఇచ్చారు.
ఈసందర్భంగా కేటీఆర్, హరీష్ రావులకు సంబంధించిన పాత వీడియోలను ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. బుధవారం సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో 34వ బూత్ దగ్గర ‘అడ్డూ’అనే కాంగ్రెస్ నాయకుడిని సీఐ గల్లా పట్టి ఈడ్చుకొచ్చి కొట్టినందుకు, తన పార్టీ నాయకుడిని రక్షించుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని, అందుకే బూత్ దగ్గరకు వెళ్లి సీఐని తిట్టాల్సి వచ్చిందని జగ్గారెడ్డి వివరణ ఇచ్చారు. ఆ బూత్లో అపోజిషన్ అభ్యర్థికి మద్దతుగా నిలుస్తూ సీఐ తమ నాయకుడిని అవమానించారని ఆయన ఆరోపించారు.
కావాలని శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకే సీఐని తిట్టానని, దీనిపై తాను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయొచ్చని, కానీ పది మందిలో తమ నాయకుడికి జరిగిన అవమానం పోదు కదా? అని ప్రశ్నించారు. ఎన్నికల నిబంధనలను ఆ సీఐ అయినా, నేనైనా ఉల్లంఘిస్తే అధికారులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని, అది అందరూ స్వాగతించాల్సిందేనన్నారు. తాను ఈ సంఘటనను నిన్న సాయంత్రం ఐదు గంటలకే వదిలేశానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. న్యాయస్థానంలో ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో తేలుతుందన్నారు. అయితే, సంగారెడ్డిలో జరిగిన ఈ సంఘటనను కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం.. జగ్గారెడ్డి అధికారులపై దాడి చేస్తున్నారని పదే పదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
