- టాటా పవర్ తో కీలక ఒప్పందం
టాటా పవర్ అనుబంధ సంస్థ అయిన టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (TPREL), ఏపీ ప్రభుత్వంతో కీలకమైన అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది.
రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ సమక్షంలో టాటా రెన్యూవబుల్ ఎనర్జీ ప్రతినిధులు, ఏపీ ప్రభుత్వం ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి.
ఈ ఒప్పందం ప్రకారం.. టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా 7 గిగావాట్ల (7వేల మెగావాట్లు) పునరుత్పాదక ఇంధన అభివృద్ధి అవకాశాలను అన్వేషిస్తాయి.
ఈ ఒప్పందం ద్వారా దాదాపు రూ.49,000 కోట్ల పెట్టుబడులతో సోలార్, పవన, హైబ్రిడ్ ప్రాజెక్టులు రాష్ట్రానికి వస్తాయి. దీంతో రాష్ట్రంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పెట్టుబడుల్లో టాటా రెన్యువబుల్ ఎనర్జీ అగ్రస్థానంలో నిలవనుంది.
ఐదేళ్లలో క్లీన్ ఎనర్జీ రంగంలో 7.5 లక్షల ఉద్యోగాలు..
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ… రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలను చేరుకునేందుకు ట్రాన్సఫార్మేషన్ ను వేగవంతం చేయాలన్న సీఎం చంద్రబాబు నాయుడు విజన్ కు అనుగుణంగా ఈ ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో రెన్యువబుల్ ఎనర్జీ రంగాన్ని ముందుకు తీసుకెళ్లడంలో టాటా రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ భాగస్వామ్యం కావడాన్ని స్వాగతిస్తున్నాం అని అన్నారు. టాటా గ్రూప్, ఎపి ప్రభుత్వం నడుమ దీర్ఘకాలిక సంబంధాన్ని ఈ ఒప్పందం బలోపేతం చేస్తుందని తెలిపారు.
రాష్ట్రంలో రానున్న ఐదేళ్లలో క్లీన్ ఎనర్జీ రంగంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 7.5 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు. భారతదేశం క్లీన్ ఎనర్జీ మిషన్కు మద్దతు ఇవ్వడంలో టాటా రెన్యూవబుల్ ఎనర్జీ కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి లోకేష్ అన్నారు.
టాటా రెన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ దీపేష్ నందా మాట్లాడుతూ.. పునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో టాటా రెన్యువబుల్ ఎనర్జీ సిఎఫ్ఓ అమిత్ మిమానీ, గ్రూప్ హెడ్ (ప్లానింగ్ రెన్యువబుల్స్) తాహేర్ లోకానంద్ వాలా, లీడ్ (స్టాటజీ) గరిమా చౌదరి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, చీఫ్ సెక్రటరీ విజయానంద్, NREDCAP ఎండి కమలాకర్ బాబు, జనరల్ మేనేజర్ (విండ్ & సోలార్) కె. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.