10 Assembly seats l కడప కోటపై లోకేష్‌ స్కెచ్‌

10 Assembly seats l కడప కోటపై లోకేష్‌ స్కెచ్‌

10 Assembly seats l ప‌క్కా వ్యూహంతో క్షేత్ర‌స్థాయిలో బ‌లోపేతం
వైసీపీ కంచుకోట‌లో పాగావేసే య‌త్నాలు
గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ చారిత్ర‌క విజ‌యం
అయినా సంతృప్తి చెంద‌ని పార్టీ కీల‌క నేత‌
అడ్డ‌గోలు స‌వాళ్లు విస‌ర‌కుండా సైలెంట్ వ్యూహాలు
గ్రౌండ్ లెవ‌ల్లో ఓటు బ్యాంకు, కేడ‌ర్ బ‌లోపేతం
స్థానిక ఎన్నిక‌లే ల‌క్ష్యంగా స‌రికొత్త ప్లాన్‌
జ‌గ‌న్‌రెడ్డి సొంత గ‌డ్డ‌పై ప‌సుపు జెండాకు ప్లాన్‌
రాజ‌కీయ‌ ప్ర‌త్య‌ర్థి కోట‌ను బ‌ద్ద‌లుకొట్టేలా లోకేష్ వ్యూహం

10 Assembly seats l సెంట్ర‌ల్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ :

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యువనేత, టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ నారా లోకేష్‌ శైలి గతంతో పోలిస్తే పూర్తిగా మారిపోయింది. ఎలాంటి ఆర్భాటాలు, ప్రకటనలు లేకుండా.. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే అత్యంత నిశ్శబ్దంగా, పక్కా వ్యూహంతో క్షేత్రస్థాయిలో స్కెచ్‌ వేయడం ఆయన ప్రత్యేకతగా మారింది. తాజాగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోట లాంటి ఉమ్మడి కడప జిల్లాపై లోకేష్‌ తన ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకుగాను ఏకంగా 7 స్థానాల్లో తెలుగుదేశం కూటమి చారిత్రాత్మక విజయం సాధించింది. అయినప్పటికీ లోకేష్‌ ఈ ఫలితాలతో ఎంతమాత్రం సంతృప్తి పడటం లేదు. ప్రత్యర్థి పార్టీలాగా కూల్చేస్తాం.. గెలిచేస్తాం అంటూ మైకుల ముందు అడ్డగోలు సవాళ్లు విసరడం కాకుండా, గ్రౌండ్ లెవల్లో పార్టీని ఏ విధంగా సంస్థాగతంగా బలోపేతం చేయాలో ఆయన స్థానిక నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రత్యర్థి ఎంత బలహీనపడినా.. తమ ఓటు బ్యాంకును, క్యాడర్‌ను నిరంతరం అప్రమత్తంగా ఉంచాలనేదే లోకేష్ వ్యూహం.

స్థానిక సంస్థల ఎన్నికలే మొదటి అంకం

త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను లోకేష్‌ తన సరికొత్త ప్లాన్‌కు మొదటి అంకంగా ఎంచుకున్నారు. గతంలో అధికార బలాన్ని నమ్ముకుని వైఎస్సార్‌సీపీ ఇక్కడ సాగించిన ఏకగ్రీవాల పర్వానికి, బెదిరింపు రాజకీయాలకు శాశ్వతంగా చరమగీతం పాడాలని సంకల్పించారు. ప్రతి గ్రామంలోనూ ప్రజా బలం ఉన్న లీడర్లను గుర్తించి, వారిని స్థానిక సమరంలో నిలబెట్టే బాధ్యతను జిల్లా ఇన్‌ఛార్జ్‌లకు అప్పగించారు. లోకేష్ వేస్తున్న ఈ సైలెంట్ స్కెచ్ ప్రభావం ఎలా ఉంటుందో వైఎస్సార్‌సీపీకి ఎన్నికల ప్రక్రియ ముగిశాక కానీ అర్థం కాద‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

జగన్ రెడ్డి సొంత గడ్డపై టీడీపీ జెండా

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన కడపలో ఇప్పటికీ వైఎస్సార్‌సీపీ క్యాడర్ కొంత యాక్టివ్‌గా ఉండటాన్ని గమనించిన టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ లోకేష్.. అక్కడ ప్రతిపక్షానికి కోలుకునే అవకాశం ఇవ్వకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు. అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు, గత ప్రభుత్వ వేధింపులకు గురైన క్షేత్రస్థాయి టీడీపీ కార్యకర్తలకు పూర్తి అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు. అధికారంలో ఉన్నాం కదా అని అలసత్వం ప్రదర్శించకుండా, ప్రతి గడపకూ కూటమి ప్రభుత్వ సంక్షేమ ఫలాలను చేరవేస్తూనే.. రాజకీయంగా ప్రత్యర్థి కోటను పూర్తిగా బద్దలు కొట్టేలా లోకేష్ రచిస్తున్న ఈ నిశ్శబ్ద చదరంగం ఇప్పుడు కడప జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.

Leave a Reply