X Platform | వైరల్ వీడియోపై సజ్జనార్ ఆగ్రహం

X Platform | వైరల్ వీడియోపై సజ్జనార్ ఆగ్రహం

X Platform | ల్యాప్‌టాప్‌తో బైక్ రైడ్..
ప్రాణాలతో చెలగాటం ఆడొద్దన్న సజ్జనార్
రోడ్డుపై నిర్లక్ష్యం ప్రమాదకరం..
యువకుడి వీడియోపై సజ్జనార్ స్పందన
క్షణిక అజాగ్రత్తే ప్రాణాంతకం..
వాహనదారులకు సజ్జనార్ హెచ్చరిక
బైక్ నడుపుతూ ల్యాప్‌టాప్ వినియోగం..
రోడ్డు భద్రతపై సజ్జనార్ సూచనలు

X Platform | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ల్యాప్‌టాప్ చూస్తూనే బైక్ నడుపుతున్న ఓ యువకుడి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో డీజీ, హైద‌రాబాద్‌ సిటీ పోలీస్ కమిషనర్‌ సీ సజ్జనార్ స్పందించారు. రహదారులపై ఇలాంటి బాధ్యతారాహిత్య చర్యలు ప్రాణాలకు ముప్పుగా మారుతాయని హెచ్చరించారు. ఈ ఘటనపై ఎక్స్ వేదికగా స్పందించిన సజ్జనార్, ఏ పనికైనా ఒక పద్ధతి ఉంటుందని, అయితే ప్రాణాలను పణంగా పెట్టి ‘వర్క్ ఫ్రమ్ బైక్’ చేయడం ఏమాత్రం సమంజసం కాదని పేర్కొన్నారు.

అవసరానికి మించి ఆత్రం ప్రదర్శించడం చివరికి ప్రమాదాలకు దారితీస్తుందని వ్యాఖ్యానించారు. వాహనం నడిపే సమయంలో క్షణకాలం ఏకాగ్రత దెబ్బతిన్నా తీవ్ర ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుందని ఆయన గుర్తు చేశారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల కేవలం తన ప్రాణాలకే కాదు, రోడ్డుపై ప్రయాణించే ఇతర అమాయకుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని చెప్పారు.

“కడుపు నింపుకోవడానికి చేసే పని.. ప్రాణాలు తీసే పరిస్థితికి దారి తీయకూడదు” అని సజ్జనార్ పేర్కొన్నారు. రహదారులపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. ఇటీవలి కాలంలో వాహనాలు నడుపుతూ మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో సజ్జనార్ చేసిన ఈ హెచ్చరిక ప్రాధాన్యత సంతరించుకుంది.