విద్యార్థులను బెదిరించిన ఆర్సీవోపై విచారణ జరిపించి సస్పెండ్ చేయాలి
ఆర్సీవోపై చర్యలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు
నీటి సమస్య చెప్పిన విద్యార్థులకు “చెప్పుతో కొడతా” అని బెదిరించడం దారుణం
ఎల్హెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు భూక్య రామ్మూర్తి నాయక్.
మరిపెడ, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ రీజినల్ కోఆర్డినేషన్ ఆఫీసర్ (ఆర్సీవో) రత్నకుమారిపై వెంటనే నిష్పాక్షిక విచారణ జరిపించి సస్పెండ్ చేయాలని ఎల్హెచ్పీఎస్ లంబాడ హక్కుల పోరాట సంఘం జిల్లా అధ్యక్షుడు భూక్య రామ్మూర్తి నాయక్ డిమాండ్ చేశారు.శనివారం మరిపెడ మండల కేంద్రంలో ఎల్హెచ్పీఎస్ లంబాడ హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల పోగులపల్లి-కొత్తగూడ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించిన సందర్భంగా విద్యార్థులు తమకు తీవ్ర తాగునీటి సమస్య ఉందని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆర్సీవో రత్నకుమారిని వినతిపూర్వకంగా కోరినట్లు తెలిపారు.అయితే విద్యార్థుల సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత గల అధికారి వారిపై అహంకార ధోరణితో స్పందిస్తూ, “చెప్పుతో కొడతా” అంటూ బెదిరించినట్లు ఆరోపించారు.
తాగునీరు వంటి ప్రాథమిక అవసరంపై ప్రశ్నించిన విద్యార్థులను కించపరిచే విధంగా మాట్లాడటం అత్యంత దురదృష్టకరమని, ఇది విద్యార్థుల మనోభావాలను దెబ్బతీసే చర్య అని అన్నారు.గతంలో కూడా పలు గురుకుల పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ, సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇటువంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయని భూక్య రామ్మూర్తి నాయక్ పేర్కొన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఘటనపై నిష్పాక్షిక విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఆర్సీవో రత్నకుమారిని వెంటనే సస్పెండ్ చేయాలని, లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఎల్హెచ్పీఎస్ లంబాడ హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్సీవో కార్యాలయం ముందు భారీ ధర్నాలు, ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో బానోతు కుమార్ నాయక్, మోతీలాల్ నాయక్, మల్సూర్ నాయక్ తదితర నాయకులు పాల్గొన్నారు.
