కల్తీ మసాలాలపై ఉక్కుపాదం.. 13 కేంద్రాల్లో తనిఖీలు
25 టన్నుల కల్తీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే కల్తీ ఆహార పదార్థాలపై అధికారులు కొరడా ఝళిపించారు. నగరంలో హెల్త్ ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు (హెచ్-ఫాస్ట్), జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగం సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో భారీగా కల్తీ మసాలాలు బయటపడ్డాయి. నగరంలోని 13 మసాలా తయారీ, విక్రయ కేంద్రాలపై అధికారులు దాడులు నిర్వహించి సుమారు 25 టన్నుల రసాయనాలతో కల్తీ చేసిన మసాలా దినుసులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మూడు కేసులు నమోదు చేశారు.
కల్తీ మసాలాల తయారీ, విక్రయాల్లో కీలకంగా వ్యవహరించిన రాహుల్ భాటి (కాటేదాన్), విశాల్ పన్వార్ (బేగంబజార్), దులీచంద్ కచావర్ (బేగంబజార్)లను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆహార పదార్థాల్లో ప్రమాదకర రసాయనాల వినియోగం వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని అధికారులు హెచ్చరించారు. ఇలాంటి కల్తీ పదార్థాల వల్ల జీర్ణకోశ సమస్యలు, అవయవాలపై ప్రభావం, దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్తె లిపారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం నగరవ్యాప్తంగా కఠిన తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
