హైదరాబాద్ : మంచి మైకులో చెప్పాలి.. చెడు చెవిలో చెప్పాలని రేవంత్ రెడ్డి డైలాగులు కొడుతుండు.. అదే చెడు చెవిలో చెబితే రక్తం కారుతది.. యాది పెట్టుకో రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో నేడు కేటీఆర్ సమక్షంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. నిన్న రేవంత్ రెడ్డి నాయకత్వంలో గాంధీ భవన్లో కాంగ్రెస్ మీటిగ్ జరిగింది. ఢిల్లీ నుంచి కొత్త ఇంచార్జీకి స్వాగతం పలుకుతూ సమావేశం పెట్టారు. మూడు ఆణిముత్యాల్లాంటి మాటలు చూశాను రేవంత్ రెడ్డి నోటి వెంట. రేవంత్ రెడ్డి సెలవిస్తూ మంచి మైకుల్లో చెప్పాలి.. చెడు చెవుల్లో చెప్పాలని సూచించిండు. మంచి మైకుల్లో చెప్పుదామంటే నువ్వు చేసిన మంచి పని లేదు. మైకుల్లో మంచి చెబుదామన్న కరెంట్ కట్ అయితుంది. చెడు చెవుల్లో చెప్పుడు మొదలుపెడితే హైడ్రా నుంచి మొదలుపెడితే ఆర్ఆర్ ట్యాక్స్, ఎస్ఎల్బీసీ టన్నెల్, పెద్దవాగు, మునిగిన వట్టెం పంప్ హౌజ్ గురించి చెబితే నీ చెవిలో రక్తం కారుతది రేవంత్ రెడ్డి… యాది పెట్టుకో. రేవంత్ రెడ్డి చాలా తెలివిగా చెప్పానని డైలాగులు కొడుతున్నాడు అని కేటీఆర్ విమర్శించారు.
ఇక కొత్త ఇంచార్జి మీనాక్షి మాట్లాడుతూ.. రైల్వేస్టేషన్లో దిగగానే బ్యాగులు మోసేందుకు కొంతమంది కాంగ్రెస్ నేతలు ఉరికొచ్చారని. బ్యాగులు మోసి మీ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసుకోవద్దని చెప్పారట ఆమె. మీ పక్కన కూర్చొన్నడు బ్యాగులు మోసి మోసి ఇడికి వచ్చిండు. అప్పుడు చంద్రబాబు బ్యాగులు మోసిండు.. ఇప్పుడు ఢిల్లీకి బ్యాగులు మోస్తుండు. ఆయనను పక్కన పెట్టుకుని బ్యాగులు మోయొద్దంటే ఆ మేడంకు ఏం చెప్పాలి. మీనాక్షి వాస్తవాలు తెలుసుకోవాలని కోరుతున్నానని కేటీఆర్ పేర్కొన్నారు.