November 25 | మృత్యు రహదారి…

November 25 | మృత్యు రహదారి…
మంత్రాలయం మార్గంలో ప్రమాదాల మళ్లీ పునరావృతం.
కోటేకల్ నుంచి చిలకలడోన వరకు.
రక్తపాతం… గత ప్రమాదంలో 5 మంది, ప్రస్తుతం 8 మంది మృతి ఘటనలు కలవరపాటు.
అతివేగం, పొగమంచు, నిర్లక్ష్యం ప్రధాన కారణాలా?.
యాత్రికుల భద్రతపై ఆందోళనలు… చర్యలు ఎక్కడ?.
November 25 | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : మంత్రాలయం మార్గంలో వరుసగా చోటుచేసుకుంటున్న ఘోర రోడ్డు ప్రమాదాలు జిల్లాలో తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. గతంలో ఎమ్మిగనూరు మండలం కోటేకల్ కొండ మలుపు వద్ద జరిగిన ప్రమాదం, తాజాగా మంత్రాలయం మండలం చిలకలడోన సమీపంలో జరిగిన ప్రమాదం రెండూ ఒకే విధమైన నిర్లక్ష్యం, భద్రతా లోపాలను బహిర్గతం చేస్తున్నాయి. 2025 నవంబర్ 29న తెల్లవారుజామున కోటేకల్ కొండ మలుపు వద్ద జరిగిన ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లా బంగారుపేట గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులు మంత్రాలయం దర్శనార్థం వస్తుండగా, దట్టమైన పొగమంచు కారణంగా ఎదురుగా వచ్చిన వాహనం కనిపించకపోవడంతో ఈ ప్రమాదం అప్పట్లో సంభవించినట్లు గుర్తించారు.ఈ ఘటనలో వెంకటేశప్ప (76), సతీష్ (34), మీనాక్షి (32), చిన్నారులు బనీత్ గౌడ (5), రిత్విక్ (4) మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

కుటుంబంలో పెద్ద దిక్కు, అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్నారులు, ఇంటికి దీపమైన ఇల్లాలు, పెద్ద దిక్కు లాంటి మహిళలు ఈ ప్రమాదంలో మృతి చెందగా, ఆ విషాద ఘటన మరిచి కనీసం 6 నెలలు కాకముందే తాజాగా ఏప్రిల్ 16న గురువారం తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో చిలకలడోన సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.

కర్ణాటకలోని చెక్ మంగళూరు ప్రాంతానికి చెందిన యాత్రికులు ప్రయాణిస్తున్న వాహనం ట్యాంకర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో కుమార్ (60), దీపిక వీణ (35), సునిల్ (40), బెల్లి (3), పుట్టమ్మ (60), మీనాక్షి (50), లోలాక్షి, తాయమ్మ అలియాస్ యశోద (60) మృతి చెందారు. మరో 13 మంది గాయపడి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసి, మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటించారు.


జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి క్షతగాత్రులను పరామర్శించి మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. ఈ రెండు ప్రమాదాలను విశ్లేషిస్తే పలు కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. కోటేకల్ ప్రమాదానికి అప్పట్లో శీతాకాలంలో దట్టమైన పొగమంచు ప్రధాన కారణమైందని పోలీసులు నిర్ధారించగా, చిలకలడోన ప్రమాదంలో అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ కీలక పాత్ర పోషించినట్లు భావిస్తున్నారు. ప్రమాదకర మలుపులు, తగిన హెచ్చరిక బోర్డుల లేమి, రాత్రి సమయంలో సరైన లైటింగ్ లేకపోవడం వంటి అంశాలు కూడా ప్రమాదాలకు దారితీస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రాత్రి వేళల్లో నిరవధికంగా వాహనాలు నడపడం వల్ల డ్రైవర్లు అలసటకు గురవడం, అప్రమత్తత కోల్పోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. ముఖ్యంగా యాత్రికులు ఎక్కువగా ప్రయాణించే మంత్రాలయం మార్గంలో భద్రతా చర్యలు బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు. ప్రయాణికులు కూడా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది.

పొగమంచు సమయంలో వేగాన్ని తగ్గించడం, డ్రైవర్ అలసటను నివారించడం, వాహనాలను సక్రమంగా నిర్వహించడం వంటి చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి. అధికారులు ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయడం, రాత్రి పర్యవేక్షణ పెంపు, వేగ నియంత్రణ చర్యలు చేపట్టడం వంటి అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
మొత్తంగా కోటేకల్, చిలకలడోన ప్రమాదాలు ఒక్కటే సందేశం ఇస్తున్నాయి—నిర్లక్ష్యం ప్రాణాంతకం. సమయానుకూల చర్యలు తీసుకుంటేనే ఇలాంటి ఘోర ప్రమాదాలను నివారించగలమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
