Kavitha Singareni Tour |సింగరేణిలో బ్రిటీష్ పాలన నడుస్తోంది
- కార్మికులను ఇబ్బంది పెడుతున్నారు
- అధికారులు, ప్రభుత్వ తీరు మారాలి
- తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
పెద్దపల్లి జిల్లా యైటింక్లయిన్ కాలనీ, ఆంధ్రప్రభ: సింగరేణిలో ఇప్పటికీ బ్రిటీష్ పాలన నడుస్తోందని, కార్మికులను వేధిస్తూ.. ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. గురువారం సింగరేణి బాయిబాటలో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండం ఓసీపీ-3, బేస్ వర్క్ షాప్లను సందర్శించారు. ఈ సందర్భంగా కార్మికులనుద్దేశించి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నుంచి పంపిస్తే ప్రజల కోసం పార్టీ పెట్టాననని, ప్రాణప్రదమైన సింగరేణి కార్మికుల ఆశీర్వాదం కోసం వచ్చాననన్నారు. మళ్లీ గెలిపిస్తే మంచి మార్పు తెస్తానన్నారు.
రేవంత్ రెడ్డి చెప్పినట్లు కాదు.. సింగరేణిలో ఇప్పటికీ కూడా బ్రిటీష్ పాలన నడుస్తోందన్నారు. ఆఫీసర్ మాట కాదని ప్రశ్నిస్తే ఛార్జ్ షీట్ ఇస్తున్నారని, కార్మికులను ఫీసర్లు ఇబ్బంది పెడుతున్నారన్నారు. మేనేజ్ మెంట్ ఒత్తిడితో కార్మికులంతా ఆందోళనతో ఉన్నారని, ఆఫీసర్లమో వాళ్ల హక్కుల కోసం ధర్నా చేశారని, అదే కార్మికులు ధర్నా చేస్తే మాత్రం మెమోలు ఇస్తున్నారన్నారు. ఇది సరికాదని, ఆఫీసర్లు, ప్రభుత్వం తీరు మారాలన్నారు. తాను టీజీబీకేఎస్లో ఉన్నప్పుడే ప్లే డే, ఎన్ మైనస్ పద్దతి, హీహెచ్డ్ లో 50 శాతం ఇచ్చే విధానం వచ్చిందని, ఈ కారణంగా కార్మికులు 2 నుంచి 3 లక్షల వరకు నష్టపోతున్నారని తెలిసిందన్నారు.
కార్మికులకు ఇంత నష్టం జరుగుతుందని అప్పుడు మాకు తెలియదని, మా కారణంగా జరిగిన తప్పునకు కార్మికులకు క్షమాపణ చెబుతున్నాన్నారు. కచ్చితంగా జరిగిన తప్పులను సవరించుకుంటామని, ఆత్మ పరిశీలన చేసుకుంటామన్నారు. మళ్లీ హీహెచ్డ్ పూర్తిస్తాయిలో వచ్చే హక్కును మీకు తెచ్చి పెడతానని మాట ఇచ్చారు. అలాగే మెడికల్ స్కీమ్ అందరికీ ఒకేలా వర్తించాలని, ఒక్కొక్కరికీ ఒక్కో న్యాయం ఉండొ ద్దన్నారు. మెడికల్ స్కీమ్ పారదర్శకంగా అమలు చేయాలన్నారు. సింగరేణి కార్మికుల నుంచి రిఫరల్ హాస్పిటల్స్ డబ్బులు వసూలు చేయకుండా చూడాలన్నారు.
సింగరేణి కార్మికులు కూడా విద్య, వైద్యం కోసం భారీగా ఖర్చు చేసే పరిస్థితి తెచ్చారన్నారు. ఇక అలియాస్ పేర్లకు సంబంధించి చాలా ఇబ్బంది పెడుతూ విజిలెన్స్ కేసులు పెడుతున్నారని, గతంలో మేము అలియాస్ పేర్ల విషయంలో చూసి చూడనట్లు వ్యవహరించాలని యాజమాన్యానికి చెప్పి ఎంతో మందికి మేలు చేశామన్నారు. సింగరేణి కార్మికులకు చదువు ప్రామాణికం కాదని, కానీ ఉద్యోగాలు ఇవ్వొద్దన్న కారణంతో ఇవన్నీ చేస్తున్నారన్నారు. డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని, ఇప్పటి వరకు కూడా 2 వేల మందికి ఇంకా ఉద్యోగాలు ఇవ్వకుండా పెండింగ్లో ఉంచారన్నారు.
నాలుగు నెల క్రితం మేము హైదరాబాద్ లో సింగరేణి భవన్ ను ముట్టడిస్తే మెడికల్ బోర్డు పెట్టాడు, కానీ దాని వల్ల కూడా ఎవరికీ ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. కచ్చితంగా నెలకు రెండుసార్లు సింగరేణి మెడికల్ బోర్డును నిర్వహించాలని, నాలుగైదు నెలల్లో రిటైర్ మెంట్ అవుతున్న వాళ్లు డిపెండెంట్ ఉద్యోగం కోసం టెన్షన్ పడవద్దని, హెచ్ఎంఎస్ గెలిచిన వెంటనే మీ అప్లికేషన్ డేట్ ను ప్రామాణికం చేసేలా చేస్తామన్నారు. సింగరేణలో ఓపెన్ కాస్ట్, అండర్ గ్రౌండ్ మైనింగ్ రెండు ఉండాలనే పాలసీ మాకు ఉందని, ఇక్కడ ఓసీ-3 మన సంస్థ ఆధ్వర్యంలో నడవటం కారణంగానే ఇక్కడ ఎక్కువ మంది పర్మినెంట్ ఎంప్లాయిస్ ఉన్నారన్నారు. అదే ప్రైవేట్ వాళ్లు నిర్వహించే మైనింగ్ లో ఎక్కువ మంది కాంట్రాక్ట్ కార్మికులే ఉంటారని, ఫ్యూచర్ లో ఓపెన్ కాస్ట్ గనులను కూడా సింగరేణియే నిర్వహించాలన్నారు.
