Kandula Durgesh | మోడల్ చెరువుగా అభివృద్ధి చేయాలని మంత్రి ఆదేశాలు

నిడదవోలు, ఆంధ్రప్రభ: నిడదవోలు పట్టణంలోని మాలకోడూరు చెరువు అభివృద్ధి, సుందరీకరణ పనులకు మరింత వేగం పెంచాలని మంత్రి కందుల దుర్గేష్ అధికారులను ఆదేశించారు. చెరువు అభివృద్ధి పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రస్తుత పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

చెరువు చుట్టూ కాలినడకన తిరిగిన మంత్రి.. జరుగుతున్న నిర్మాణ పనులు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం అధికారులు రూపొందించిన అభివృద్ధి ప్రణాళికలు, మ్యాప్‌లను పరిశీలించి పలు సూచనలు చేశారు.

మోడల్ చెరువుగా తీర్చిదిద్దాలి…

అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాలకోడూరు చెరువును కేవలం సుందరీకరణ పనులకే పరిమితం చేయకుండా, నిడదవోలు పట్టణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే మోడల్ చెరువుగా అభివృద్ధి చేయాలని మంత్రి సూచించారు. పట్టణ ప్రజలు కుటుంబ సమేతంగా వచ్చి ఆహ్లాదకరంగా గడిపేలా అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

చెరువు పరిసర ప్రాంతాల్లో కాలినడక మార్గాలు, వాకింగ్‌, వ్యాయామానికి అనువైన వాతావరణం కల్పించేలా అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. ప్రజల ఆరోగ్యం, వినోదం, ఆహ్లాదం దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు అమలు చేయాలని తెలిపారు.

నాణ్యతలో రాజీ వద్దు..

అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని మంత్రి స్పష్టం చేశారు. రూపొందించిన ప్రణాళికలకు అనుగుణంగా నిర్దేశిత గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ప్రజలకు ఉపయోగపడే విధంగా శాశ్వత ప్రయోజనాలు కలిగేలా అభివృద్ధి చేపట్టాలని సూచించారు.

ప్రజలకు మెరుగైన జీవన వాతావరణమే లక్ష్యం

పట్టణాల్లో అందుబాటులో ఉన్న సహజ వనరులను సద్వినియోగం చేసుకుని ప్రజలకు మెరుగైన జీవన వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మాలకోడూరు చెరువును నిడదవోలు పట్టణానికి గుర్తింపుగా నిలిచేలా, ప్రజలు సేదతీరే ఆహ్లాదకర ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.