Maharashtra Well Accident | దర్శనం ముగించుకుని వస్తుండగా ఘోరం.. 8మంది మృతి

Maharashtra Well Accident | దర్శనం ముగించుకుని వస్తుండగా ఘోరం.. 8మంది మృతి

బావిలోకి దూసుకెళ్లిన పికప్‌ వాహనం..

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భక్తులతో వెళ్తున్న పికప్‌ వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న నీటితో నిండిన బావిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురిని స్థానికులు, సహాయక బృందాలు రక్షించాయి.

సోలాపూర్‌ జిల్లా మాల్షిరస్‌ తాలూకాలోని తాందుల్‌వాడి గ్రామ సమీపంలో, మ్హస్వడ్‌–పంఢర్‌పూర్‌ మార్గంలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. రాంజణి గ్రామానికి చెందిన 14 మంది సిద్ధనాథుడి దర్శనం కోసం పికప్‌ వాహనంలో వెళ్లారు. దర్శనం అనంతరం తిరిగి స్వగ్రామానికి వస్తుండగా వాహనం ఒక్కసారిగా అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడిపోయినట్లు సమాచారం.

ప్రమాదం జరిగిన బావి రహదారికి అత్యంత సమీపంలో ఉండటంతోపాటు, దాని చుట్టూ సరైన రక్షణ గోడ లేకపోవడం ప్రమాద తీవ్రతను పెంచినట్లు తెలుస్తోంది. బావి పూర్తిగా నీటితో నిండి ఉండటంతో వాహనంలో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు స్థానికులు, పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఇప్పటివరకు ఎనిమిది మంది మృతదేహాలను వెలికితీసినట్లు స్థానిక కథనాలు వెల్లడించాయి.

మృతుల్లో నలుగురు మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నట్లు స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్‌ జాన్కర్‌ వెల్లడించారు. వాహనంలో ఉన్న ఇద్దరు పురుషులు సహా మొత్తం ఆరుగురిని ప్రాణాలతో రక్షించినట్లు సమాచారం. ప్రమాద వార్త తెలియగానే పోలీసులు, అత్యవసర సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని చర్యలు చేపట్టాయి.

పికప్‌ వాహనం అదుపు తప్పడానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయాడా, వాహనంలో సాంకేతిక లోపం ఏర్పడిందా, లేక రహదారి పరిస్థితులే ప్రమాదానికి కారణమయ్యాయా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనతో రాంజణి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. బాధిత కుటుంబాలకు వీలైనంత త్వరగా ప్రభుత్వ సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని స్థానిక ప్రజాప్రతినిధులు తెలిపారు.

Leave a Reply