స్వర్ణ ఆంధ్ర @2047 లక్ష్యాలకు నాణ్యమైన గణాంకాలే పునాది
- కలెక్టర్ డా. జి. లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ: జిల్లా ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయాలంటే స్థూల విలువ జోడింపు (జివిఏ), స్థూల జిల్లా దేశీయోత్పత్తి (జిడిడిపి) వంటి ఆర్థిక సూచికలపై ప్రతి శాఖకు సమగ్ర అవగాహన ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు.
విజయవాడ కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన సామర్థ్య పెంపు శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు. జిల్లా ఆర్థికాభివృద్ధి, జివిఏ, జిడిడిపి, రంగాల వారీ ఆర్థిక వృద్ధి, జిల్లా–మండల స్థాయిలో ఆర్థిక గణాంకాల తయారీ, విశ్లేషణ తదితర అంశాలపై మాస్టర్ ట్రైనర్లైన మండల స్థాయి అధికారులు, సీవీఏపీ యూనిట్ సభ్యులు, యంగ్ ప్రొఫెషనల్స్కు సమగ్ర అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2025–26 సంవత్సరానికి జిల్లా జిడిడిపి సుమారు రూ.1,05,135 కోట్లుగా నమోదైందన్నారు. జిల్లా అభివృద్ధి ప్రగతిని అంచనా వేయడంలో జివిఏ, జిడిడిపి వంటి ఆర్థిక సూచికలు కీలకమని పేర్కొన్నారు. ప్రతి శాఖ జివిఏ లెక్కింపు విధానాలు, రంగాల వారీ వృద్ధి, గణాంకాల వినియోగంపై పూర్తి అవగాహనతో పనిచేయాలని సూచించారు.
2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకోవాలంటే నూరు శాతం అక్షరాస్యత సాధించడం అత్యవసరమని తెలిపారు. అక్షరాస్యతతో పాటు నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత కల్పిస్తే పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలతో అధిక శాతం ప్రజలను తీర్చిదిద్దే అవకాశం ఉంటుందన్నారు. మహిళలు సంపూర్ణ నైపుణ్యాలను సొంతం చేసుకున్నప్పుడే కుటుంబాలతో పాటు రాష్ట్ర, దేశ ఆర్థికాభివృద్ధికి బలమైన ఆధారంగా నిలుస్తారని చెప్పారు. నైపుణ్య విద్య ద్వారా ఉపాధి అవకాశాలు విస్తరించి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని వివరించారు.
వ్యవసాయ రంగంలో సంప్రదాయ పంటలతో పాటు విలువ ఆధారిత వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వరి సాగులోని కొంత భూమిని ఉద్యానవన పంటలకు మళ్లించడం ద్వారా రైతుల ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉందన్నారు. విజయవాడ ఉత్సవాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా సేవారంగంలో సుమారు రూ.150 కోట్ల అదనపు స్థూల విలువ జోడింపును సాధించామని తెలిపారు. జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధితో సేవారంగం మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు.
జిల్లాలోని సహజ, మానవ వనరులు, భౌగోళిక అనుకూలతలను సమర్థవంతంగా వినియోగించుకొని అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలని అధికారులకు సూచించారు. వ్యవసాయంలో ఉత్పత్తి పెంపుతో పాటు విలువ ఆధారిత ఉత్పత్తులపై దృష్టి పెట్టాలని, సేవా, పారిశ్రామిక రంగాల విస్తరణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
శిక్షణ కార్యక్రమాలను కేవలం సైద్ధాంతిక అంశాలకు పరిమితం చేయకుండా పరస్పర చర్చలు, ప్రశ్నోత్తరాలు, ఆచరణాత్మక ఉదాహరణలతో నిర్వహించాలని సూచించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను మండల స్థాయి అధికారులు, ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులు, స్వర్ణ గ్రామ–స్వర్ణ వార్డు సిబ్బందికి సమర్థవంతంగా చేరవేయాలని ఆదేశించారు.
శిక్షణలో పాల్గొన్న అధికారులు మాస్టర్ ట్రైనర్లుగా వ్యవహరించి జివిఏ, జీఎన్డీపీ, జిడిడిపి, జీఎస్డీపీ వంటి ఆర్థిక భావనలపై క్షేత్రస్థాయి వరకు అవగాహన కల్పించాలని సూచించారు. అభివృద్ధి ప్రణాళికల అమలులో భాగస్వాములైన ప్రతి స్థాయి అధికారి, సిబ్బందికి ఈ అంశాలపై ప్రాథమిక పరిజ్ఞానం ఉండటం అవసరమని పేర్కొన్నారు. జిల్లా ఆర్థికాభివృద్ధికి సంబంధించిన గణాంకాల సేకరణ, విశ్లేషణ, వినియోగంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక & గణాంక శాఖ జాయింట్ డైరెక్టర్ బి. అనుపమ మాట్లాడుతూ, ప్రతి శాఖ తన పరిధిలోని గణాంక సమాచారాన్ని ఖచ్చితత్వంతో, పారదర్శకతతో, నిర్ణీత గడువులో అందించాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసి విశ్వసనీయ గణాంకాల ఆధారంగా అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలని తెలిపారు. స్వర్ణ ఆంధ్ర @2047 లక్ష్యాల సాధనలో నాణ్యమైన, విశ్వసనీయ, సమయానుకూల గణాంకాలే విజయానికి పునాది అని పేర్కొన్నారు. మండల, నియోజకవర్గ స్థాయిలలో రంగాల వారీ జివిఏ పురోగతిని కీలక పనితీరు సూచికల ద్వారా నిరంతరం పర్యవేక్షించి అవసరమైన చోట సకాలంలో చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పహాలే ఇండియా ఫౌండేషన్ శిక్షకులు జె. అనిల్ కుమార్, బెల్లపు రాగిణి, జోనల్ కోఆర్డినేటర్ యోగేష్ కృష్ణ, జిల్లా విశ్లేషకులు, మండల స్థాయి అధికారులు, సీవీఏపీ యూనిట్ సభ్యులు, యంగ్ ప్రొఫెషనల్స్ పాల్గొన్నారు.
