కుప్పం : చిత్తూరు జిల్లా కుప్పంలో నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గృహప్రవేశ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. ఉదయం పది గంటలకు శాంతిపురం మండలంలోని కడపల్లె పంచాయతీ శివపురంలో నిర్మించిన ఆయన కొత్త ఇంటిలో గృహప్రవేశ కార్యక్రమం జరగనుంది.
ఈ సందర్భంగా సీఎం కుటుంబ సభ్యులైన నారా భువనేశ్వరి, నారా లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్ ఇప్పటికే కుప్పానికి చేరుకున్నారు. ఈ గృహప్రవేశాన్ని పురస్కరించుకుని సీఎం ఇంటి వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. అతిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పెద్ద షెడ్లు, పార్కింగ్ ఏర్పాట్లు, వసతి ఏర్పాట్లు చేశారు.
వారందరి కోసం ప్రత్యేక మెనూను సిద్ధం చేశారు. గృహప్రవేశానికి హాజరయ్యే ముప్పైవేల మందికి విందుభోజనం ఏర్పాటు చేశారు. పలు రకాల వంటకాలు, సాంప్రదాయ భోజనాలతో ప్రజలకు విందు ఏర్పాటు చేయనున్నారు. సీఎం ఇంటి వద్ద మాత్రమే కాకుండా కుప్పం పట్టణం అంతటా తెలుగుదేశం కార్యకర్తలు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఉత్సాహంగా వేడుకను జరుపుకుంటున్నారు.