జూనియర్ ఎన్టీఆర్ హెల్త్ అప్డేట్
2 నుంచి 3 నెలల్లో పూర్తిగా కోలుకుని సాధారణ స్థితికి చేరుకునే అవకాశం
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్కు సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ఈ విషయాన్ని కిమ్స్ వైద్య బృందం ప్రకటించింది. ఆర్థోపెడిక్ సర్జన్స్ బృందం నేతృత్వంలో ఈ శస్త్రచికిత్స నిర్వహించినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
డా. ఆర్.ఏ. పూర్ణచంద్ర తేజస్వి, డా. నితిన్ బెజ్జంకి, డా. మధుసూదన్రావు, డా. శ్రీనివాస్రావు సూరపనేని ఆధ్వర్యంలోని వైద్యుల బృందం ఈ సర్జరీని విజయవంతంగా పూర్తి చేసింది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ వైద్యుల పర్యవేక్షణలో క్షేమంగా ఉన్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. శస్త్రచికిత్స అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఎన్టీఆర్ మరో 2 నుంచి 3 నెలల్లో పూర్తిగా కోలుకుని సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తారక్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.
కాగా ఎన్టీఆర్ కి గత నెలలో ఓ ప్రమాదంలో భూజానికి గాయమైన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా విశ్రాంతిలో ఉన్న ఎన్టీఆర్ వైద్యుల సలహా మేరకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ చిత్రంలో నటిస్తున్నారు. ఎన్టీఆర్ పూర్తిగా కోలుకున్న తరువాత చిత్రికరణలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

