ఏసీపీ కార్యాలయంలో కానిస్టేబుల్‌ ఆత్మహత్య

సాయికుమార్‌ మృతిపై ఆగ్రహించిన కుటుంబ సభ్యులు.. కార్యాలయంలో ఫర్నిచర్‌ ధ్వంసం

ఎల్బీనగర్‌, ఆంధ్రప్రభ: ఎల్బీనగర్‌ ఏసీపీ కార్యాలయంలో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ సాయికుమార్‌ బుధవారం కార్యాలయంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి గురై ఏసీపీ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు.

కుటుంబ సభ్యులు కార్యాలయంలోని ఫర్నిచర్‌, కంప్యూటర్లను ధ్వంసం చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎల్బీనగర్‌ ఏసీపీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు చేరుకున్నాయి. కానిస్టేబుల్‌ సాయికుమార్‌ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. వ్యక్తిగత కారణాలతోనే ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.