Hospital | వైద్యురాలి నిర్లక్ష్యంతో పసికందు మృతి
Hospital | పాల్వంచ, ఆంధ్రప్రభ : పట్టణంలోని శ్రీ విజయ నర్సింగ్ హోమ్(Shri Vijaya Nursing Home)లో చోటుచేసుకున్న దారుణ ఘటన కలకలం రేపింది. పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన గర్భిణీ స్త్రీ కుంజా భవాని (24) పట్ల ఆసుపత్రి యాజమాన్యం, వైద్యులు చూపిన అమానవీయ నిర్లక్ష్యం కారణంగా ఆమె బిడ్డ ప్రసవంలోనే మృతి చెందింది.
కుంజా భవానిని పురిటి నొప్పులతో ఆసుపత్రికి తీసుకొచ్చినప్పటికీ, సమయానికి డాక్టర్ అందుబాటులో లేకపోవడం తీవ్ర అలసత్వానికి దారితీసింది. ఆసుపత్రి సిబ్బంది(Hospital Staff) నిర్లక్ష్యం కారణంగా సకాలంలో వైద్య సేవలు అందక, ప్రసవ సమయంలో బిడ్డ చనిపోయినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.
ఫీజు కడితేనే డిశ్చార్జ్… మానవత్వం మరిచిన యాజమాన్యం
బిడ్డ మృతితో శోకసంద్రంలో ఉన్న బాధితురాలి కుటుంబాన్ని ఓదార్చాల్సింది పోయి, ఆసుపత్రి యాజమాన్యం మరింత అమానవీయంగా వ్యవహరించింది. ఆసుపత్రి ఫీజు పూర్తిగా చెల్లిస్తేనే రోగిని డిశ్చార్జ్(Discharge) చేస్తామంటూ పట్టుబట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
యాజమాన్యం మానవత్వం లేకుండా వ్యవహరించడం పట్ల ఆగ్రహించిన బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యం కారణంగానే బిడ్డ చనిపోయిందని, దీనికి ఆసుపత్రి యాజమాన్యమే బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

