ప్రజానాయకుడి చివరి ప్రయాణానికి జనసంద్రం
నర్సంపేట అభివృద్ధి శిల్పికి వేలాదిగా తరలివచ్చిన ప్రజలు.. పార్టీలకు అతీతంగా నివాళులు
‘మీ కుటుంబానికి మేమున్నాం’ అంటూ ప్రజల భరోసా..
నర్సంపేట, ఆంధ్రప్రభ: నర్సంపేట అభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేసిన మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ పోరాట యోధుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మరణాన్ని నర్సంపేట నియోజకవర్గ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మృతితో గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా నియోజకవర్గమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి నుంచి ఆయన భౌతికకాయం నర్సంపేటకు చేరుకోగా, చివరిసారి తమ అభిమాన నాయకుడిని చూసేందుకు వేలాది మంది స్వచ్ఛందంగా తరలివచ్చారు. అయ్యప్పస్వామి ఆలయం సమీపం నుంచి ప్రారంభమైన అంతిమయాత్రలో బీఆర్ఎస్ నాయకులతో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, రైతులు, కార్మికులు, మహిళలు, యువత, వ్యాపారులు, మేధావులు, సబ్బండ వర్గాల ప్రజలు పార్టీలకు అతీతంగా పాల్గొని బాష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన స్వగ్రామమైన నల్లబెల్లిలో ప్రజల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఉంచనున్నారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజలతో ఏర్పరచుకున్న అనుబంధం, ఆయన సేవాభావం, తెలంగాణ ఉద్యమంలో పోషించిన పాత్ర, నర్సంపేట అభివృద్ధికి అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ పలువురు భావోద్వేగానికి గురయ్యారు. “పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబం ఒంటరిది కాదు.. నర్సంపేట ప్రజలందరం అండగా ఉంటాం” అంటూ ప్రజలు ఏకకంఠంతో భరోసా వ్యక్తం చేశారు. “మీరు భౌతికంగా దూరమైనా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు” అంటూ కన్నీటి నివాళులు అర్పించిన వేలాది మంది, ఆయన చూపిన మార్గాన్ని కొనసాగిస్తామని సంకల్పం వ్యక్తం చేశారు.
