కొనుగోలు కేంద్రంలో రైతు ఆత్మహత్యాయత్నం..

కొనుగోలు కేంద్రంలో రైతు ఆత్మహత్యాయత్నం..
- ధాన్యం సేకరణలో జాప్యంతో మనస్తాపం
- పురుగుల మందు తాగిన బిక్షపతి
- మెదక్ జిల్లాలో ఘటన
చేగుంట, ఆంధ్రప్రభ : ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రానికి వెళ్ళిన రైతు రోజుల తరబడి పడిగాపులుకాసినా ధాన్యం సేకరణ జరగకపోవడంతో మనస్తానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మెదక్ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా చేగుంట మండల పరిధిలోని మక్కారాజుపేట సాల్కోన్ చెరువు తండాకు చెందిన రాట్ల భిక్షపతి (55) తాను పండించిన పంటను విక్రయించేందుకు స్థానిక ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్ళాడు.
రోజుల తరబడి నిరీక్షించిన ధాన్యం కొనుగోళ్లు జరగకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు బిక్షపతి శుక్రవారం రాత్రి కేంద్రం వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి చేగుంట పోలీసులకు, తహశీల్దార్ కు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న ఎస్ఐ చైతన్యకుమార్ రెడ్డి, తహసిల్దార్ శివప్రసాద్ క్రిమిసంహారకమందు సేవించిన బిక్షపతిని అంబులెన్స్ లో తూప్రాన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు.
