లంకమ్మ తల్లికి ఆషాఢ సారె సమర్పించిన ఎమ్మెల్యే సతీమణి

గురుపౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు

అవనిగడ్డ, ఆంధ్రప్రభ: గ్రామదేవత శ్రీ లంకమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ పౌర్ణమి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సతీమణి విజయలక్ష్మి, తనయుడు మండలి వెంకట్రామ్ అమ్మవారిని దర్శించుకుని ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఆషాఢ సారె సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ అన్నపరెడ్డి వెంకటస్వామి, అర్చకులు, డైరెక్టర్లు, దేవాదాయ శాఖ సిబ్బంది వారిని సత్కరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

అనంతరం గురుపౌర్ణమి సందర్భంగా అవనిగడ్డలోని శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయాన్ని విజయలక్ష్మి, మండలి వెంకట్రామ్ దర్శించుకుని సాయినాథునికి నవవిధ అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.