హైదరాబాద్ : ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అనర్ధాలకు కేసీఆర్ బాధ్యత వహించాలని, రాష్ట్ర ఖజానాను లూటీ చేసింది కేసీఆరే అని ఆయన మండిపడ్డారు. ఆయన స్పీచ్ అంతా అక్కసుతో నిండి ఉందని విమర్శించారు. తాను సీఎం అయిన రెండో రోజే కేసీఆర్ గుండె పగిలిపోయిందని ఆరోపించారు. గతంలో ఖమ్మంలో రాహుల్ గాంధీ సభకు బస్సులు ఇవ్వకపోవడం మోసపూరిత చర్య అని అంటూ తాము మాత్రం కేసీఆర్ సభకు అవసరమైనన్ని బస్సులు సమకూర్చామన్నారు.
హైదరాబాద్ లోని సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి నివాసానికి నేటి ఉదయం వచ్చిన సందర్భంగా రేవంత్ మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ పార్టీపై, పాలనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ను నమ్మే స్థితిలో ప్రజలు లేరని, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అనర్థాలకు కేసీఆరే కారణమని విమర్శించారు. కేసీఆర్ రాష్ట్ర ఖజానా అంతా ఖాళీ చేసి ఇప్పుడు మాపై నిందలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ అభద్రతా భావంలో అక్కసు వెల్లగక్కారని ఫైర్ అయ్యారు. ఆయన స్పీచ్ లో క్లారిటీ లేదన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసుల విషయంలో చట్టం మేరకే చర్యలు తీసుకుంటామన్నారు, కేసీఆర్ లాగా తాను చట్టాన్ని అతిక్రమించనన్నారు. కేటీఆర్ మీద ఉన్న కేసులు కూడా చట్ట ప్రకారమే సాగిస్తామని స్పష్టం చేశారు. కాగా, అసెంబ్లీ సమావేశాల్లో తాను చేసిన వ్యాఖ్యలే కేసీఆర్ సభలో పునరావృతం చేశారని విమర్శించారు. కేటీఆర్, హరీష్ రావులను చిన్నపిల్లలుగా పేర్కొన్న వ్యాఖ్యలు కూడా కేసీఆర్ తీరుని ప్రతిబింబిస్తున్నాయని చెప్పారు.
తనకు రాహుల్ గాంధీతో మంచి మైత్రి ఉందని, ఇది ఎవరు నమ్మినా, నమ్మకపోయినా తనకు పరవాలేదన్నారు. రాహుల్ గాంధీకి.. నాకు తెలిస్తే చాలు.. బయట ఎవరేం అనుకుంటున్నారు అనేది నాకు అనవసరమని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ఇతర రాష్ట్రాల్లో అమలు చేయలేకపోయిన విషయాన్ని గుర్తు చేశారు. కొంత మంది అధికారుల పనితీరు తెలిసినా, అవసరంగా ఉన్న కారణంగా వారి సేవలను కొనసాగించాల్సి వస్తోందన్నారు. కలెక్టర్ల మార్పు వేరే విషయమని, అవసరమైన మార్పులు చేసుకుంటామని వివరించారు. తనను నమ్ముకున్న వారిని తాను ఎప్పటికీ మర్చిపోనని, నన్ను నమ్మిన వారిలో ఒకరైన దయాకర్కు ఎమ్మెల్సీ పదవి వచ్చిందని చెప్పారు. ఓపికగా ఉన్న వారికే తన నుండి బాధ్యతలు వస్తాయని, బయటకి వెళ్లి విమర్శలు చేస్తే తనపై బాధ్యత ఉండదన్నారు.