హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ హిమాయత్ నగర్ బ్రాంచ్ భవనంలో గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. హంతకులు మృతదేహాన్ని బిల్డింగ్ లిఫ్ట్ లో వదిలి పరారయ్యారు. ఉదయం బ్యాంకుకు చేరుకున్న సిబ్బంది లిఫ్ట్ లో మృతదేహం కనిపించడంతో భయాందోళనలకు లోనయ్యారు. బ్యాంకు సిబ్బంది సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించారు. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి ఘటనా స్థలాన్ని పరిశీలించి పోలీసులకు పలు సూచనలు చేశారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. అత్యంత కిరాతకంగా జరిగిన ఈ హత్యకు పాత కక్షలే కారణం కావొచ్చని భావిస్తున్నారు. మృతుడికి సంబంధించిన వివరాలు, హంతకుడి ఆచూకీ కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.