కర్నూలు – తమ మతాచారం ప్రకారం పెళ్లి జరిపించాలని..పట్టుబట్టిన యువతి తరపు బంధువులు పట్టుబట్టిన నేపథ్యంలో మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలు జిల్లా, ఆదోని పరిధిలోని హోళగుంద మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపి వివరాల ప్రకారం… హనవాళు చెందిన రాజు అనే యువకుడి తల్లిదండ్రులు జీవనోపాధి నిమిత్తం హొళగుందలో నివసిస్తున్నారు. ఎండి హళ్లికి చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరు గాఢంగా ప్రేమించుకోవడంతో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇరువైపుల కుటుంబ సభ్యుల ప్రేమ వ్యవహారాన్ని చెప్పడంతో వారు అంగీకరించారు. ఈ క్రమంలో మే 16వ తేదీన పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వరుడి కుటుంబ సంప్రదాయాల ప్రకారం తంతు జరిగింది. అనంతరం వధువు కుటుంబ సభ్యుల తమ మత ఆచారం ప్రకారం పెళ్లి చేయాలని పట్టుబట్టారు. దీంతో వరుడు మానసికంగా కుంగిపోయాడు. పెద్దహరివాణం శివారులో పురుగుల మందు తాగి కిందపడిపోయాడు. స్థానికులు గమనించి అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాజు మృతి చెందాడు. దీంతో హనవాళు గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. రాజు తల్లిదండ్రులు గోరంట్ల, ఈరమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.