AP | ఏసీబీకి చిక్కిన డీఆర్వో పునర్నియామకం…
సస్పెన్షన్ ఎత్తివేసిన ప్రభుత్వం
AP | పల్నాడు, ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా రెవెన్యూఅధికారిగా నరసరావుపేటలో పనిచేస్తున్న కాలంలో ఏసీబీ దాడిలో పట్టుబడిన ఏకా మురళిపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి 24న లంచం డిమాండ్ చేసి.. తీసుకున్న ఆరోపణలతో ఏసీబీ ఆయనపై కేసు నమోదు చేసింది. ఆయనను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించడంతో ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సస్పెండ్ అయిన అధికారులపై ఉన్న కేసులను జులై 22న సమీక్షించిన కమిటీ ఏకా మురళిని విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తూ ఆయన సస్పెన్షన్ రద్దు చేసి పునర్నియామకం చేసింది. ఆయనపై కొనసాగుతున్న క్రిమినల్, శాఖాపరమైన విచారణకు ఎలాంటి ఆటంకం కాబోదని స్పష్టం చేసింది. ఆయనను సుదూర ప్రాంతాల్లో అప్రాధాన్య పోస్టుల్లో నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలన విభాగం ఎదుట హాజరుకావాలని తెలిపింది.
