Neelkanth Mishra | ప్రధాని ఆర్థిక సలహాదారుడికి అంతర్జాతీయ బాధ్యతలు….
Neelkanth Mishra | ప్రధాని ఆర్థిక సలహాదారుడికి అంతర్జాతీయ బాధ్యతలు….
- ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నీలకంఠ్ మిశ్రా
ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (EAC-PM) సభ్యుడు, ప్రముఖ ఆర్థికవేత్త నీలకంఠ్ మిశ్రాకు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉన్న వరల్డ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆయనను నియమించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
నీలకంఠ్ మిశ్రా మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న మాజీ ఐఏఎస్ అధికారి పరమేశ్వరన్ అయ్యర్ స్థానంలో ఆయన నియమితులయ్యారు. మిశ్రా బాధ్యతలు స్వీకరించే వరకు పరమేశ్వరన్ అయ్యర్ పదవీకాలాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పొడిగించింది.
నియామకానికి కేంద్ర మంత్రివర్గ నియామకాల కమిటీ (Appointments Committee of the Cabinet) ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో సభ్యుడిగా ఉన్న నీలకంఠ్ మిశ్రా దేశంలోని ప్రముఖ ఆర్థిక విశ్లేషకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు.
గతంలో యాక్సిస్ బ్యాంక్, క్రెడిట్ సూయిస్ వంటి ప్రముఖ ఆర్థిక సంస్థల్లో ఉన్నత పదవులు నిర్వహించిన ఆయనకు ఆర్థిక విధానాలు, మార్కెట్లు, పెట్టుబడుల రంగంలో విశేష అనుభవం ఉంది.
వరల్డ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నీలకంఠ్ మిశ్రా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పేదరిక నిర్మూలన, ఆరోగ్యం, విద్య, ఆర్థిక వృద్ధి వంటి రంగాలకు నిధులు సమకూర్చే ప్రపంచంలోని అతిపెద్ద అభివృద్ధి రుణ సంస్థల్లో ఒకటైన వరల్డ్ బ్యాంక్లో కీలక విధాన నిర్ణయాల్లో ఆయన పాత్ర ఉండనుంది.
అభివృద్ధి చెందుతున్న దేశాలు మౌలిక సదుపాయాలు, ఆర్థిక వృద్ధి, వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనే ప్రాజెక్టులకు మరింత నిధుల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో భారతదేశానికి చెందిన ప్రముఖ ఆర్థికవేత్త ఈ కీలక అంతర్జాతీయ పదవికి ఎంపిక కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

