Kusumanchi | యుద్ధ‌ ప్రాతిప‌దిక‌న పాలేరు సాగ‌ర్ అండ‌ర్ ట‌న్నెల్ ప‌నులు – మంత్రి పొంగులేటి

కూసుమంచి ఆంధ్ర‌ప్ర‌భ : ఖ‌మ్మం జిల్లాలో సుమారు నాలుగు ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీటిని అందించే పాలేరులోని నాగార్జున సాగ‌ర్ ఎడ‌మ ప్ర‌ధాన కాలువ అండ‌ర్ ట‌న్నెల్ (యూటీ) ప‌నుల‌ను యుద్ద‌ప్రాతిప‌దిక‌న పూర్తి చేయాల‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఎట్టిప‌రిస్ధితుల్లోనూ వ‌చ్చే జూలై 10వ తేదీనాటికి పూర్తిచేసి వానాకాలం సీజ‌న్‌కు రైతాంగానికి నీటిని విడుద‌ల చేయాల‌ని ఆదేశించారు. శుక్రవారం ఆయ‌న కూసుమంచి మండ‌లం జుజ్జుల‌రావుపేట‌లో జ‌రుగుతున్న‌ పాలేరు సాగ‌ర్ కాలువ ప‌నుల‌ను ఆకస్మికంగా త‌నిఖీ చేశారు.

రూ.14.2 కోట్ల‌తో యూటీ కాలువ మ‌ర‌మ్మ‌తులు
ఈ సంద‌ర్బంగా మంత్రి మాట్లాడుతూ గత ఏడాది కురిసిన భారీ వ‌ర్షాల‌కు సెప్టెంబ‌ర్‌లో పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలోని కూసుమంచి మండ‌లం జుజ్జుల‌రావు పేట స‌మీపంలో పాలేరు రిజర్వాయ‌ర్ ద‌గ్గ‌ర ప్ర‌ధాన కాలువ‌పై అండ‌ర్ ట‌న్నెల్ ( యూటీ) కొట్టుక‌పోయింద‌న్నారు. రైతుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కూడ‌ద‌న్న ఆలోచ‌న‌తో అప్ప‌ట్లో తాత్కాలిక ఏర్పాట్లు చేసి సాగునీటిని అందించారు. శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న రూ 14.20 కోట్లతో ఈ యూటీ కాలువ మ‌ర‌మ్మ‌తుల‌ను ప్రారంభించామ‌న్నారు. ఖ‌మ్మం జిల్లాలో వ్య‌వ‌సాయ రంగానికి జీవ‌నాధార‌మైన ఈ కాలువ మ‌ర‌మ్మ‌తుల‌ను పూర్తిచేసి సాగునీరు అందిస్తామ‌ని చెప్పారు. దీనివ‌ల్ల‌ ఖ‌మ్మం జిల్లాలో సుమారు నాలుగు ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీరు అందుతుండ‌గా ఒక్క పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలో 1.33 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీరు అందుతుంద‌ని తెలిపారు. వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని అత్యంత ప్రాధాన్య‌తా క్రమంలో అవ‌స‌ర‌మైతే రోజుకు రెండు షిఫ్ట్‌ల క్ర‌మంలో ప‌నిచేసి గ‌డువులోగా నిర్మాణ‌ప‌నుల‌ను పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *